కోవిడ్-19 (కరోనా వైరస్) నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14 వరకు 21 రోజుల లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాల ఆర్ధిక పరిస్ధితులపై కరోనా ప్రభావం పడింది. ఈ క్రమంలో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలను కొంత మేర వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ఐఏఎస్ అధికారులకు 60శాతం, ప్రభుత్వ ఉద్యోగులందరికీ 50శాతం, నాలుగోతరగతి ఉద్యోగులకు 10శాతం వరకు జీతాలను వాయిదా వేయాలని ముందుగా ప్రభుత్వం నిర్ణయించింది.
అయితే రాష్ట్రంలో కరోనా వైరస్ నివారణకు ముమ్మర చర్యలు చేపడుతున్న వైద్య–ఆరోగ్యం, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బందికి పూర్తిగా జీతాలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా కూడా ఈ మూడు కేటగిరీల్లో సిబ్బందికి పూర్తిగా జీతాలు చెల్లించాలని ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన నిర్ణయాన్ని వెల్లడించారు. ఈ శాఖలకు చెందిన ఉద్యోగులు నిరంతరం శ్రమిస్తూ కరోనా వైరస్ నియంత్రణకు వారు చేస్తున్న సేవలు అద్భుతమని సీఎం వైఎస్ జగన్ అభిప్రాయపడ్డారు.