ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పాఠశాల విద్యాశాఖపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సందర్భంగా పాఠశాలల్లో నాడు-నేడు, జగనన్నవిద్యాకానుక, మధ్యాహ్న భోజనం, 8వతరగతి పిల్లలకు ట్యాబ్లు, అన్ని పాఠశాలల్లో ఇంటర్నెట్ సహా పలు అంశాలపై సీఎం కీలక ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక గత మూడేళ్లలో ఏపీలో విద్య , వైద్య, వ్యవసాయం రంగాల్లో విప్లవాత్మక మార్పు తీసుకువచ్చామని అన్నారు. ఇంత చేస్తున్నా కూడా దురదృష్టవశాత్తూ కొన్ని సంస్థలు దుష్ప్రచారం చేస్తున్నాయని, అన్నింటిని ఎదుర్కుంటూ లక్ష్యాల వైపు సాగాలని సీఎం వైఎస్ జగన్ అధికారులకు సూచించారు.
ముందుగా గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలు, పురోగతిపై విద్యాశాఖ అధికారులు సీఎంకు వివరించారు. నాడు-నేడు కింద పనులకోసం ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు రూ.1120 కోట్లు విడుదల చేశామని చెప్పారు. 2023–24 విద్యాసంవత్సరంలో పాఠశాలలు తెరిచే నాటికి విద్యాకానుకను అందించేలా కచ్చితమైన ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు. 8వ తరగతి పిల్లలకు ట్యాబ్లు ఇచ్చే పథకానికి సంబంధించి ట్యాబ్లు రావడం మొదలయ్యిందని అధికారులు తెలిపారు. లక్షన్నరకు పైగా ట్యాబ్లు అందుబాటులో ఉన్నాయని, 8వ తరగతి విద్యార్థులకు, టీచర్లకు కలిపి మొత్తంగా 5,18,740 ట్యాబ్లు పంపిణీ చేయనున్నామని చెప్పారు. ముందుగా ట్యాబ్స్ టీచర్లకు పంపిణీ చేసి, అందులో కంటెంట్పై వారికి అవగాహన కల్పిస్తామన్నారు. నాడు-నేడు రెండో విడత పనుల పరిస్థితిని అధికారులు సీఎంకు వివరిస్తూ, పాఠశాలల్లో నాడు-నేడు కింద కల్పించిన సౌకర్యాలు, వాటి నిర్వహణపై ఆడిట్ చేయించామని తెలిపారు.
అలాగే తరగతి గదులను డిజిటలైజేషన్ చేస్తున్నందున ప్రతి స్కూల్లో కూడా ఇంటర్నెట్ సౌకర్యం ఏర్పాటు చేయాలని సీఎం సూచించగా, జనవరి-ఫిబ్రవరి నాటికి ప్రతి స్కూల్లో కూడా ఇంటర్నెట్ సౌకర్యం ఏర్పాటు అవుతుందని అధికారులు వివరించారు. జగనన్న విద్యాకానుకను పకడ్బందీగా అందించడానికి చర్యలు తీసుకుంటున్నామని, వచ్చే విద్యాసంవత్సరానికి సంబంధించి టెండర్ల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందన్నారు. ఏప్రిల్ నాటికే విద్యాకానుక కిట్లను సిద్ధంచేస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. మరోవైపు పాఠశాలల మెరుగైన నిర్వహణ కోసం, మండలవిద్యాశాఖ అధికారితో పాటు మరో అధికారిని పెడుతున్నామన్న అధికారులు తెలిపారు. సెర్ఫ్లో పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్లను నాన్ అకడమిక్ వ్యవహారాలను పర్యవేక్షించడానికి నియమిస్తున్నామని, అక్టోబరు17 నుంచి కూడా ఈ విధానం అమల్లోకి వస్తుందని అధికారులు తెలిపారు. జగనన్న గోరుముద్ద పథకంపైనా కూడా సీఎం సమీక్ష జరిపారు. మధ్యాహ్న భోజనం నాణ్యతను కచ్చితంగా పాటించాలని అధికారులకు సీఎం వైఎస్ జగన్ ఆదేశాలు ఇచ్చారు. ఈ సమీక్షా సమావేశంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పాఠశాల విద్యాశాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ ఎం.వి శేషగిరిబాబు సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY