ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం ఉదయం డా.వైఎస్ఆర్ తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను ప్రారంభించారు. విజయవాడలోని బెంజ్ సర్కిల్ లో జరిగిన ఈ కార్యక్రమంలో అధునాతన వసతులతో కూడిన 500 వైఎస్ఆర్ తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను సీఎం వైఎస్ జగన్ జెండా ఊపి ప్రారంభించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవానంతరం తల్లీబిడ్డను సురక్షితంగా ఇంటికి చేర్చేలా ఉచిత రవాణా సేవలు అందించేందుకు ఈ వాహనాలను అందుబాటులోకి తీసుకువచ్చారు.
ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, “ఈ రోజు మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ఎయిర్ కండిషర్డ్ వసతులతో ఉన్న 500 కొత్త వాహనాలను ఈ రోజు రాష్ట్ర నలుమూలలకు పంపుతున్నాం. ప్రతి అక్కకు, చెల్లెమ్మలకు మంచి జరగాలని ఈ ప్రభుత్వం మొదటిరోజునుంచి అడుగులు వేస్తుంది. అందులో భాగంగానే వారి కోసం ఈ వాహనాలను కూడా అందుబాటులోకి తెస్తున్నాం. ప్రసవానంతరం తల్లీబిడ్డలను ఈ వాహనాల్లో సురక్షితంగా ఇంటివద్ద దింపే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. గతంలో అరకొరగా వాహనాలు ఉండేవి, కొన్ని చోట్ల అందుబాటులో కూడా ఉండేవి కావు, వసతులు కూడా అంతంత మాత్రమే. ఆ పరిస్థితి నుంచి నేడు అన్ని సదుపాయాలతో ఈ వాహనాలను తీసుకొస్తున్నాం. నాడు-నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల వ్యవస్థలు, రూపురేఖలు మారుతున్నాయి” అని అన్నారు. ఇక ముందు కూడా ఇంకా మంచి కార్యక్రమాలు చేపడతామని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఆళ్ల నాని, వెల్లంపల్లి శ్రీనివాస్ సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ