ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థుల కోసం ఇప్పటికే అమ్మఒడి, నాడు-నేడు, జగనన్న వసతి దీవెన పథకాలను వైసీపీ ప్రభుత్వం అమలుచేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యార్థులకు అండగా ఉండేందుకు ‘’జగనన్న విద్యా దీవెన” పేరుతో మరో ప్రతిష్టాత్మక పథకానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఏప్రిల్ 28, మంగళవారం నాడు ‘జగనన్న విద్యా దీవెన’ పథకాన్ని సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. జగన్న విద్యా దీవెన పథకం ద్వారా ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, పీజీ, పీహెచ్డీ వరకు అన్ని ఉన్నత విద్యలు చదివే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, కాపు, మైనారిటీ, దివ్యాంగ విద్యార్థులకు పూర్తి స్థాయిలో ఫీజు రియంబర్స్మెంట్ చెల్లిస్తారు. 2020–21 విద్యా సంవత్సరం నుంచి ప్రతి త్రైమాసికం పూర్తైన తర్వాత విద్యార్థుల తల్లుల ఖాతాలోనే నేరుగా ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు జమ చేయనున్నారు.
ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, విద్యార్థుల తల్లులతో సీఎం వైఎస్ జగన్ మాట్లాడారు. విద్యా దీవెన పథకాన్ని ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. విద్యార్థులకు హాస్టల్స్ లో బోర్డింగ్, లాడ్జింగ్ కోసం వసతి దీవెన, పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ కోసం విద్యా దీవెన అనే రెండు పథకాలను తీసుకొచ్చినట్టు వెల్లడించారు. పిల్లలకు ఇవ్వగలిగే ఆస్తి చదువొక్కటేనని, మంచి చదువులతోనే పేదల కుటుంబాల బతుకులు మారుతాయని చెప్పారు. ఫీజు రీయింబర్స్మెంట్ కింద రూ. 4,000 కోట్లకు పైగా నిధులు విడుదల చేశారు. గత ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.1,880 కోట్ల బకాయిలను కూడా కాలేజీలకు చెల్లించనట్టు ప్రకటించారు. ఈ పథకం ద్వారా దాదాపు 12 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరే అవకాశముందని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu