ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు (మంగళవారం) ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. మంగళవారం సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సీఎం జగన్ భేటీ కానున్నారు. ఈ సందర్భంగా ఏపీకి సంబంధించిన పలు అంశాలపై చర్చించనున్నారు. ఏపీలో కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాల విషయం కూడా ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది. కొత్త జిల్లాల ఏర్పాటుకు గల కారణాలను ఈ సందర్భంగా ప్రధానికి తెలుపనున్నారు. పోలవరం ప్రాజెక్ట్ వద్ద జరుగుతున్న నిర్మాణ పనులను ప్రధానికి వివరించనున్నారు. అలాగే పునర్విభజన చట్టంలోని వెనుకబడిన జిల్లాలకు సంబంధించి అందాల్సిన నిధుల గురించి ప్రధానితో చర్చించే అవకాశాలు ఉన్నాయి. ఇంకా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులతో పాటు రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలకు కావాల్సిన నిధుల విషయం కూడా ప్రధాని మోదీని అడగనున్నట్లు సమాచారం. అయితే ఈ ఢిల్లీ పర్యటనలో ప్రధానితో పాటు, కేంద్ర మంత్రి అమిత్ షాతోనూ సీఎం జగన్ భేటీ అవనున్నారని, దీనిపై ఇప్పటికే సీఎంవో అమిత్ షాతో భేటీకి అపాయింట్ మెంట్ కోరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు, పలు కీలక అంశాలను అమిత్ షాకు వివరించనున్నారు సీఎం జగన్.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ