ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిసెంబర్ 5, గురువారం నాడు కియా మోటార్స్ గ్రాండ్ ఓపెనింగ్ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు కియా ఫ్యాక్టరీకి చేరుకుని ముందుగా కియా కంపెనీ ప్రతినిధులతో సమావేశం అయ్యారు. పరిశ్రమకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్న అనంతరం పరిశ్రమలోని అన్ని విభాగాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కియా మోటార్స్ ప్లాంట్ను సీఎం ప్రారంభించారు. కియా ఫ్యాక్టరీకి సంబంధించిన డాక్యుమెంటరీ చిత్రాన్ని వీక్షించారు. అనంతరం సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ పెనుకొండలో కియా కంపెనీని ప్రారంభించటం సంతోషంగా ఉందని చెప్పారు.
ప్రపంచ స్థాయిలో అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో కియా కార్ల పరిశ్రమ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కియా కార్ల పరిశ్రమకు ఈ ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని తెలిపారు. ఈ కంపెనీ ద్వారా ప్రత్యక్షంగాను, పరోక్షంగా వేల మందికి ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. ఈ దిశగా మరిన్ని కియా బ్రాంచిలు ప్రారంభం కావాలని ఆకాంక్షించారు. కియా కంపెనీ బాటలోనే మరికొన్ని కంపెనీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తాయని సీఎం వైఎస్ జగన్ ఆశాభావం వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు బొత్స సత్యనారాయణ, మేకపాటి గౌతంరెడ్డి, శంకర్ నారాయణ, గుమ్మనూరు జయరాం, ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్యేలు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డి, డాక్టర్ సిద్ధారెడ్డి, ఎమ్మెల్సీ ఇక్భాల్, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
[subscribe]