తెలంగాణ బిజెపి నాయకురాలు, మాజీ మంత్రి డీకే అరుణ మద్యపానాన్ని నిషేధించాలంటూ నిరాహార దీక్ష చేపట్టబోతున్నారు. డిసెంబర్ 11, 12 తేదీల్లో హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ వద్ద మద్య నిషేధం కోసం నిరాహార దీక్ష చేస్తానని ఆమె వెల్లడించారు. ‘మహిళా సంకల్ప దీక్ష ‘ పేరుతో రెండు రోజులపాటు చేసే దీక్షకు అన్ని పార్టీలు, మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు, మహిళలు మద్దతు ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో మద్యం అమ్మకాలు అదుపు లేకుండా సాగడం వలనే మహిళలపై దారుణాలు, రోడ్డు ప్రమాద ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయని ఆమె పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన సక్రమంగా జరగడం లేదని, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఘటనపై పార్లమెంట్లో చర్చ జరిగినా కూడా, సీఎంకు చీమ కుట్టినట్టు కూడా లేదని డీకే అరుణ విమర్శించారు. మహిళలతో ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. హైదరాబాద్ నగరంలో ఎక్కడా చూసిన పబ్ లు దర్శనమిస్తున్నాయని, తెలంగాణ రాష్ట్రంలో మద్యం, డ్రగ్స్పై పూర్తీ స్థాయి నిషేధం విధించాలని డీకే అరుణ డిమాండ్ చేశారు.
[subscribe]