ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం నాడు ‘జగనన్న విద్యాదీవెన’ పథకం మొదటి విడత కింద రూ.671.45 కోట్ల నిధులు విడుదల చేశారు. 2020–21 విద్యాసంవత్సరానికి సంబంధించి ఫీజు రీయింబర్స్మెంట్ కింద రాష్ట్రవ్యాప్తంగా 10,88,439 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.671.45 కోట్లను తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి సీఎం వైఎస్ జగన్ జమ చేశారు. త్రైమాసికం చొప్పున మొత్తం నాలుగు విడతల్లో ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించనున్నారు. ఇక రెండో విడత చెల్లింపులు జులైలో, మూడో విడత డిసెంబర్ లో, నాలుగోవిడత వచ్చే ఫిబ్రవరిలో జరగనున్నాయి. జగన్న విద్యా దీవెన పథకం ద్వారా ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, పీజీ, పీహెచ్డీ వరకు అన్ని ఉన్నత విద్యలు చదివే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, కాపు, మైనారిటీ, దివ్యాంగ విద్యార్థులకు పూర్తి స్థాయిలో ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించనున్నారు.
ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, విద్యాదీవెన మొదటివిడత కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. పిల్లలకు మనం ఇచ్చే నిజమైన ఆస్తి చదువేనని, చదువుతోనే జీవితాల రూపురేఖలు మారుతాయన్నారు. విద్యా దీవెన ద్వారా మొత్తం 10,88,439 మంది విద్యార్థులకు లబ్ధిచేకూరుతుందన్నారు. 2018-19 సంవత్సరంలో గత ప్రభుత్వం బకాయిలు పెట్టిన రూ.1800 కోట్లను ఈ ప్రభుత్వమే చెల్లించిందన్నారు. అలాగే 2019-20 సంవత్సరానికి రూ.4207.85 కోట్ల పూర్తి రీయింబర్స్మెంట్ను చెల్లించామని, ఇప్పటివరకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు లేకుండా చేశామని తెలిపారు. ప్రతి త్రైమాసికం పూర్తికాగానే తల్లుల ఖాతాల్లోకి నేరుగా నగదు జమ చేస్తామని చెప్పారు. అర్హత కలిగివుండి ఫీజు రీయంబర్స్ మెంట్ లో ఏ రకమైన ఇబ్బందులున్నా 1902 కు ఫోన్ చేసి ప్రభుత్వానికి తెలియజేయాలని, ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని ఆ మొత్తం అందేలా చూస్తుందని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ