పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరులో అంతుచిక్కని వ్యాధితో అస్వస్థతకు గురవుతున్న ప్రజల సంఖ్య పెరుగుతుంది. గత శనివారం సాయంత్రం నుంచి ఇప్పటివరకు 500 మందికి పైగా ప్రజలు అస్వస్థత గురైనట్టు తెలుస్తుంది. వీరంతా ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రితో పాటుగా స్థానిక ఆస్పత్రుల్లోనూ చికిత్స పొందుతున్నారు. వాంతులు, ఆకస్మికంగా కింద పడిపోవటం, నోటి వెంట నురగలు రావటం, స్పృహ కోల్పోవటం, మూర్ఛ వంటి లక్షణాలతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. ఓవైపు అస్వస్థతకు గురైన బాధితుల్లో 330 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. మరోవైపు కొత్త బాధితుల సంఖ్య కూడా పెరుగుతుంది.
ఇక బాధితుల రక్త నమూనాల్లో సీసం, నికెల్ వంటి భారీ లోహాల అవశేషాలు ఉన్నట్లుగా ఢిల్లీ ఎయిమ్స్ నిర్వహించిన పరీక్షలో వెల్లడైనట్టు బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహరావు తెలిపారు. సీసం వలనే బాధితుల్లో న్యూరో-టాక్సిక్ లక్షణాలు కనిపిస్తున్నాయని వైద్యులు భావిస్తున్నారన్నారు. తాగునీరు లేదా పాలు ద్వారా ఈ అవశేషాలు బాధితుల శరీరంలోకి ప్రవేశించి ఉంటాయని వైద్యులు అనుమానిస్తున్నారు. స్థానికంగా ఉపయోగిస్తున్న తాగునీరు, పాలు నమూనాలను పంపాలని ఢిల్లీ ఎయిమ్స్ నిపుణులు రాష్ట్ర ప్రభుత్వాన్నికోరినట్టుగా తెలిపారు.
ఇక రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ఏలూరులోనే ఉండి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద పరిస్థితులను పర్యవేక్షిస్తూ, బాధితులకు త్వరితగతిన వైద్య సేవలు అందించేలా చర్యలు చేపడుతున్నారు. అదేవిధంగా పరిస్థితి విషమంగా ఉన్న కొందరిని మెరుగైన వైద్యం అందించేందుకు విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి, గుంటూరు జీజీహెచ్ కు తరలించి వైద్యం అందిస్తున్నారు. మంగళవారం నాడు ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యూహెచ్ఓ) బృందం, కేంద్ర బృందాలు కూడా ఏలూరులో పర్యటించనున్నాయి. ప్రజలు అస్వస్థతకు గురైన ప్రాంతాల్లో ఈ బృందాల ప్రతినిధులు పర్యటించి నమూనాలను సేకరించి, బాధితులతో మాట్లాడి వివరాలు తెలుసుకోనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ