శ్రీకాకుళం సీనియర్ రాజకీయ నాయకుడు, ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన మంత్రి వర్గంలోకి అడుగుపెట్టారు. ఏపీ రెవెన్యూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ మంత్రిగా ధర్మాన ప్రసాదరావు బాధ్యతలు చేపట్టారు. ఈరోజు సచివాలయంలోని 5వ బ్లాక్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం లాంఛనంగా బాధ్యతలు చేపట్టారు. పాత మంత్రివర్గంలో ఆయన సోదరుడు ధర్మాన కృష్ణదాస్ పనిచేశారు. మొన్న జరిగిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో ఆయనకు బదులుగా ప్రసాదరావును మంత్రి పదవి వరించింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మంత్రిగా పదవీబాధ్యతలు స్వీకరించిన శుభసందర్భంలో తన మనసులోని భావాలను పంచుకున్నారు.
తనను నమ్మి మంత్రిగా అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. గతంలో రెవెన్యూ శాఖలో మంత్రిగా పని చేసిన అనుభవం ఉందని, సీనియర్ అధికారులతో సమన్వయం చేసుకుని రాష్ట్ర అభివృద్ధిలో భాగమవుతానని పేర్కొన్నారు. రాష్ట్రంలో, దేశంలో భూమికి సంబంధించిన వివాదాలు అధికంగా ఉన్నాయని, దీనివల్ల దేశవ్యాప్తంగా ఆర్ధిక అభివృద్ధి కుంటుపడుతోందని వెల్లడించారు. అలాగే ఎక్కువ ల్యాండ్ను ఫ్రీ హోల్డ్ చేస్తే జీడీపీ పెరుగుతుందని, అందుకే రాష్ట్రంలో భూ సర్వేకు సీఎం జగన్ ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. ఒక్కొక్క అంశాన్ని పరిశీలిస్తూ, వివాదాలు పరిష్కరిస్తూ ముందుకు వెళతామని ధర్మాన ప్రసాదరావు అన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ