రాష్ట్రంలో కరోనా పరిస్థితుల నేపథ్యంలో పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలను రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా ఫలితాలకు సంబంధించి మార్గదర్శకాల రూపకల్పన కోసం హైపవర్ కమిటీని ఏర్పాటు చేస్తామని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో పదో తరగతి ఫలితాలు ప్రకటనకు అనుసరించాల్సిన మార్గదర్శకాలను రూపొందించడానికి ఏపీ ప్రభుత్వం హైపవర్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ పదో తరగతి ఫలితాల కోసం మార్కుల కేటాయింపు, పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలపై ప్రభుత్వానికి సూచించనుంది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారిణి ఎం.ఛాయారతన్ ను హైపవర్ కమిటీకి చైర్పర్సన్ గా, ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ ఎ.సుబ్బారెడ్డిని కన్వీనర్ గా నియమించారు.
రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి డైరెక్టర్ బి.ప్రతాప్రెడ్డి, ప్రకాశం జిల్లా డీఈవో సుబ్బారావు సభ్యులుగా ఉండనున్నారు. అలాగే ఈ కమిటీలో మరో ఆరుగురు నిపుణులను కూడా నియమించారు. ఈ మేరకు రాష్ట్ర విద్యా శాఖ డైరెక్టర్ వి.చినవీరభద్రుడు గురువారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు ఇంటర్మీడియట్ ఫలితాలకు కోసం కూడా అనుసరించాల్సిన మార్గదర్శకాలను నిర్ణయించడానికి ఎం.ఛాయారతన్ నేతృత్వంలోనే మరో హైపవర్ కమిటీని విద్యాశాఖ నియమించింది. ఈ కమిటీల మార్గదర్శకాలపై ప్రభుత్వం నిర్ణయం అనంతరం, అందుకు అనుగుణంగా పదో తరగతి, ఇంటర్ ఫలితాలను విడుదల చేయనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ