తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్ కన్నుమూశారు. హైదరాబాద్ లోని బసవతారకం ఆసుపత్రిలో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. సోమవారం మధ్యాహ్నం కోడెల శివప్రసాద్ తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య ప్రయత్నం చేసినట్టు తెలుస్తుంది. అనంతరం కుటుంబ సభ్యులు బసవతారకం ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి పూర్తిగా విషమించడంతో వెంటిలేటర్ పై చికిత్స అందించారు. డాక్టర్లు ఎంత ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. కోడెల మరణవార్తతో ఆయన అభిమానులు, అనుచరులు, టీడీపీ పార్టీ కార్యకర్తలు విషాదంలో మునిగిపోయారు.
కోడెల వ్యక్తిగత-రాజకీయ ప్రస్థానం:
- కోడెల శివప్రసాదరావు గుంటూరు జిల్లా నకరికల్లు మండలం కండ్లగుంట గ్రామంలో 1947 మే 2వ తేదీన జన్మించారు.
- తాతయ్య ప్రోత్సాహంతో, వైద్య విద్య అభ్యసించారు
- మొదట కర్నూల్ వైద్యశాలలో చదివిన ఆయన, తరువాత గుంటూరుకు మారి ఎంబీబీఎస్ పూర్తీ చేసారు
- ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో ఎం.ఎస్ చేసారు
- అనంతరం నరసరావుపేటలో ఆసుపత్రి నెలకొల్పి వైద్యవృత్తిని కొనసాగించగారు
- స్పల్ప కాలంలోనే మంచి డాక్టర్ గా పేరుతెచ్చుకున్న కోడెలను, ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు
- 1983 లో టీడీపీ నుంచి నరసరావుపేట ఎమ్మెల్యేగా విజయం సాధించారు
- 1983 నుంచి 2004 వరకు వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు
- ఎన్టీఆర్, చంద్రబాబు ప్రభుత్వాల్లో పలు శాఖలకు మంత్రిగా వ్యవహరించి మంచి పేరు తెచ్చుకున్నారు. హోంమంత్రిగా, భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా, పంచాయితీరాజ్ శాఖ మంత్రిగా సేవలు అందించారు
- 2014 లో సత్తెనపల్లి నుంచి గెలిచినా కోడెల శివప్రసాద్, ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత తోలి స్పీకర్ గా బాధ్యతలు నిర్వహించారు
- 2019 లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో సత్తెనపల్లి నుంచి ఓటమి పాలయ్యారు
- వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అసెంబ్లీ ఫర్నిచర్ తరలింపు విషయంలో కోడెల, అతని కుటుంబ సభ్యులపై కేసులు నమోదు చేయగా, విచారణ దశలో ఉన్నాయి.
- కోడెల శివప్రసాద్ వయసు 72 సంవత్సరాలు, భార్య, ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు
- రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే కోడెల శివప్రసాద్ ఆత్మహత్యాయత్నం చేసారని అనుచరులు ఆరోపిస్తున్నారు.