ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటైన కొత్త మంత్రివర్గంలో చోటుదక్కకపోవడంతో పలువురు వైఎస్సార్సీపీ నేతలు అసంతృప్తికి లోనయ్యారు. గతంలో మంత్రులుగా ఉన్న కొందరు సహా, కొత్తగా మంత్రివర్గంలో చోటు దక్కుతుందని ఆశ పెట్టుకున్న పలువురు ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తికి గురవడంతో వారి అనుచరులు పలు ప్రాంతాల్లో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్త మంత్రివర్గంలో చోటుదక్కకపోవడంతో అసంతృప్తితో ఉన్న మాజీ హోమ్ శాఖ మంత్రి, పత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరిత కీలక నిర్ణయం తీసుకున్నారు. సోమవారం ఉదయం కార్యకర్తలతో జరిగిన సమావేశంలో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నట్లు మేకతోటి సుచరిత ప్రకటించారు. అయితే వైఎస్సార్సీపీ లో కొనసాగుతానని ఆమె పేర్కొన్నారు.
మరోవైపు తన నియోజకవర్గంలో ఇతర ప్రజాప్రతినిధులు, అనుచరులు ఎవరూ రాజీనామా చేయొద్దని, పార్టీకి ఎలాంటి నష్టం జరగకుండా చూసుకోవాలని ఆమె సూచించారు. గత మంత్రివర్గంలో ఎస్సీ సామాజికవర్గం నుంచి ఉన్న ఐదుగురిలో నలుగురిని కొనసాగించి, తనను పక్కనపెట్టడంతోనే మేకతోటి సుచరిత ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. మరోవైపు వైఎస్సార్సీపీ కీలక నేత బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసే విషయంపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ