ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం నాడు స్పందన కార్యక్రమంలో భాగంగా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పాఠశాలల ప్రారంభంపై సీఎం వైఎస్ జగన్ స్పందించారు. నవంబర్ 2 వ తేదీ నుంచి రాష్ట్రంలో పాఠశాలలు ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. అన్ని పాఠశాలల్లో 1 నుంచి 8 తరగతి విద్యార్దులకు రోజు విడిచి రోజు (రెండ్రోజులకు ఒకసారి) తరగతులు జరిగేలా ప్రణాళిక రూపొందించి, ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. 1, 3, 5, 7 తరగతులు ఒకరోజున మరియు 2,4,6,8 తరగతులకు మరో రోజు తరగతులు నిర్వహించాలని సూచించారు. ఒక వేళ ఏదైనా పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 750కి మించి ఉంటే, మూడు రోజులకు ఓసారి తరగతులు నిర్వహించాలని చెప్పారు.
పాఠశాలలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకే తెరవాలని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం పెట్టి ఇంటికి పంపించాలని చెప్పారు. నవంబర్ నెలలో ఒంటి పూట విధానం అమలవుతుందని, డిసెంబర్ నెలలో పరిస్థితులను బట్టి తదుపరి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల వలన తల్లిదండ్రులు ఒకవేళ తమ పిల్లలను బడికి పంపకపోతే, వారి కోసం ఆన్లైన్ తరగతులను నిర్వహించాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశాలు ఇచ్చారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu