ఈఎస్ఐ కేసులో అరెస్టైన మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు బుధవారం సాయంత్రం గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ (జీజీహెచ్) నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆయన ఆరోగ్యం మెరుగుపడడంతో వైద్యులు డిశ్ఛార్జి చేశారు. అనంతరం ఏసీబీ అధికారులు అచ్చెన్నాయుడును విజయవాడ సబ్జైలుకు తరలించినట్టుగా తెలుస్తుంది. ఇటీవలే అచ్చెన్నాయుడు రిమాండ్ ను జూలై 10 వరకు పొడిగిస్తూ అవినీతి నిరోధకశాఖ(ఏసీబీ) న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఏసీబీ అధికారులు జీజీహెచ్ లోనే మూడు రోజుల పాటు అచ్చెన్నాయుడిని విచారించారు.
మరోవైపు అచ్చెన్నాయుడును డిశ్చార్జ్ చేయడంపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు స్పందించారు. ఈ మేరకు ఆయన వరుస ట్వీట్స్ చేశారు. “ఇప్పటికే అచ్చెన్నాయుడు అరెస్ట్ లో ప్రభుత్వం అడుగడుగునా అమానవీయంగా వ్యవహరించి, ఆయనకు రెండోసారి సర్జరీ జరిగేందుకు కారణమైంది. ఇంకా కక్షతీరలేదన్నట్టు, ఆయన్ను ఉన్నట్టుండి డిశ్చార్జ్ చేయించి డాక్టర్స్ డే రోజున మరో దుర్మార్గానికి పాల్పడింది ప్రభుత్వం. డిశ్చార్జ్ చేయడంలో కూడా కనీస నిబంధనలు పాటించరా? సాయంత్రం 5 గంటల తర్వాత డిశ్చార్జ్ చేస్తూ, 4.20 గం.ల సమయం వేయడం ఏంటి? కమిటీ ముసుగులో, తప్పుడు నివేదికలతో అచ్చెన్నాయుడి ఆరోగ్యంతో చెలగాటం ఆడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. చికిత్స పొందాల్సిన వ్యక్తిని వీల్ చైర్ లో కూర్చోబెట్టి, అంబులెన్సులో జైలుకు తీసుకువెళ్ళడం వెనుక అచ్చెన్నాయుడును ఒక్కరోజైనా జైల్లో ఉంచాలనే మీ సైకో మనస్తత్వం కనపడుతోంది. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని” చంద్రబాబు ట్విట్టర్ వేదికగా ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu