కరోనా కారణంగా పాఠశాలలను, కళాశాలలను ప్రారంభించే పరిస్థితి లేకపోవడంతో ప్రత్యామ్నాయంగా ఒకటవ తరగతి నుంచి పీజీ వరకు డిజిటల్, ఆన్లైన్ విద్యాబోధనను చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు రాష్ట్రంలోని విద్యార్థులు విద్యా సంవత్సరాన్ని నష్టపోకుండా ఉండేందుకు గుణాత్మకమైన డిజటల్, ఆన్లైన్ తరగతులను నిర్వహించబోతున్నామని మంత్రి తెలిపారు. సోమవారం నాడు తన కార్యాలయంలో విద్యా శాఖ పనితీరును సమీక్షించారు. ఒకటవ తరగతి నుంచి పీజీ వరకు జూలై 1వ తేదీ నుంచి డిజిటల్, ఆన్లైన్ తరగతులను నిర్వహించనున్నామని మంత్రి పేర్కొన్నారు. విద్యార్థులు టెలివిజన్, స్మార్ట్ ఫోన్ ద్వారా ఈ పాఠాలను వీక్షిస్తారని ప్రభుత్వం ఆశిస్తోందని, ఎవరి వద్దెనా టీవీలు లేకపోతే గ్రామపంచాయితీ కార్యాలయాల్లోనూ, గ్రంధాలయాల్లోని టీవిలను వినియోగించుకునే విధంగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించనున్నట్లు మంత్రి తెలిపారు.
డిజిటల్, ఆన్లైన్ తరగతులను నిర్వహించడం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న దాదాపు 27 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుందని మంత్రి వెల్లడించారు. విద్యార్థులకు అవసరమైన పాఠ్యపుస్తకాలను సంబంధిత పాఠశాలకు చేరవేసే ప్రక్రియ దాదాపు 90 శాతం పూర్తయిందని మంత్రి తెలిపారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న డిజిటల్, ఆన్లైన్ తరగతుల వల్ల విద్యార్థులకు ఏవైనా అనుమానాలుంటే నివృత్తి చేయాలని ఉపాధ్యాయులకు సూచించామని అన్నారు. ఆన్లైన్ తరగతులకు సంబంధించి ప్రైవేట్ విద్యా సంస్థలు కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ప్రాజ్ఞత మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు చేపట్టాలని ఆదేశించామని తెలిపారు. ఏదేని కారణం వల్ల దూరదర్శన్, టీ-సాట్ పాఠాలను వీక్షించని వారి కోసం ఆ డిజిటల్ పాఠాలను ప్రత్యేకంగా టీ-సాట్ యాప్ లోనూ, దూరదర్శన్ యూట్యూబ్ లోనూ అందుబాటులో ఉంచుతున్నామని, అందుబాటులో ఉన్న సమయాల్లో డిజిటల్ పాఠాలను పునశ్చరణ చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు.
విద్యార్థులకు సంబంధించిన డిజిటల్ క్లాసులు, వర్క్ షీట్లను కూడా ఎస్సీఈఆర్టీ కి సంబంధించిన htts://scert.telangana.gov.in వెబ్ సైట్లో పొందవచ్చని అన్నారు. పాఠశాలల్లో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు మధ్య దాదాపు 75 వేల వాట్సప్ గ్రూపులును ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, డిప్లమో ఫైనల్ ఇయర్ పరీక్షలను నిర్వహించేందుకు ఆయా యూనివర్సిటీలు కార్యాచరణ ప్రణాళికను రూపొందించి జూలై మాసంలో అమలు చేయాలని నిర్ణయించడం జరిగిందని తెలిపారు. పాఠశాల స్థాయి నుండి డిగ్రీ వరకు ఉపాధ్యాయులు, బోధనా సిబ్బంది ప్రతీ రోజూ యాభై శాతం వస్తే చాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ పాపిరెడ్డి, వైస్ చైర్మన్లు లింబాద్రి, వెంకటరమణ, ప్రభుత్వ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, సాంకేతిక విద్య కమిషనర్ నవీన్ మిత్తల్, పాఠశాల విద్య డైరెక్టర్ దేవసేన, తదితరులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ