విజయవాడ నగరంలో కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 18, శుక్రవారం నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ సంయుక్తంగా నిర్వహించాల్సి ఉంది. నితిన్ గడ్కరీ ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది. అయితే నితిన్ గడ్కరీకి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవ కార్యక్రమం వాయిదా పడినట్లుగా ఎంపీ కేశినేని నాని వెల్లడించారు. రేపటి ప్రారంభోత్సవం వాయిదా పడినప్పటికీ ప్రజా అవసరాల దృష్ట్యా కనకదుర్గ ఫ్లైఓవర్ పై రేపటి నుండే ట్రాఫిక్ ను వదలటం జరుగుతుందని ఎంపీ కేశినేని నాని తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు.
రూ.502 కోట్ల వ్యయంతో అబ్బురపరిచేలా నిర్మించిన ఈ ఫ్లైఓవర్ ప్రారంభం కోసం విజయవాడ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అసలు ముందుగా సెప్టెంబర్ 4 నే ఈ ఫ్లైఓవర్ ను ప్రారంభించాలని నిర్ణయించారు. భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వారం రోజుల పాటుగా సంతాప దినాలు ప్రకటించడంతో, ఫ్లైఓవర్ ప్రారంభోత్సవ కార్యక్రమం తొలిసారి వాయిదా పడింది. తాజాగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కరోనా బారిన పడడంతో మరోసారి వాయిదా పడింది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu