రాష్ట్రంలో అమలుచేస్తున్న నైట్ కర్ఫ్యూను మరో వారం పాటుగా పొడిగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నివారణ, నైట్ కర్ఫ్యూ కొనసాగింపు, వ్యాక్సినేషన్ పై రాష్ట్ర మంత్రులు, కోవిడ్ టాస్క్ఫోర్స్, ఇతర ఉన్నతాధికారులతో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సందర్భంగా నైట్ కర్ఫ్యూ పొడగింపు సహా సీఎం వైఎస్ జగన్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూను మరో వారం రోజులు కొనసాగించనున్నారు. ప్రజలంతా కరోనా నిబంధనలను తప్పనిసరిగా పాటించేలా చూడాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. జన సమూహాల ఉండే చోట యధాతధంగా ఆంక్షలు కొనసాగించాలని చెప్పారు.
ముఖ్యంగా థర్డ్వేవ్ వస్తే ఎదుర్కొనేందుకు రాష్ట్రంలో అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని అధికారులను సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. కమ్యూనిటీ ఆసుపత్రుల స్ధాయివరకు ఆక్సిజన్ బెడ్లు అందుబాటులో ఉండాలని, పీహెచ్సీల్లో కూడా ఆక్సిజన్ సిలిండర్లు, కాన్సంట్రేటర్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలలో పీడియాట్రిక్ సూపర్ కేర్ ఆసుపత్రుల పనులను వేగవంతం చేయాలని చెప్పారు. ఇక రాష్ట్రంలో సమర్ధవంతమైన నిర్వహణ ద్వారా ఎక్కుమందికి కరోనా వ్యాక్సిన్ అందించామని, తద్వారా 11 లక్షల డోసులను ఆదా చేసినట్టు చెప్పారు. 5 ఏళ్లలోపు పిల్లలున్న తల్లులందరికీ 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తయిందని, ఇప్పటివరకు 31796 మంది విదేశాలకు వెళ్లే వారు కూడా వ్యాక్సిన్ తీసుకున్నారన్నారు. రాష్ట్రంలో 45ఏళ్లు దాటిన వారికి వ్యాక్సినేషన్ పూర్తయిన తర్వాత టీచర్లకు వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టాలని అధికారులకు సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ