తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో అరెస్టయి సుమారు యాభై రోజులుగా జైలులోనే ఉన్నారు. తాజాగా సీఐడీ మరో కేసు ఆయనపై నమోదు చేసింది. మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతి ఇచ్చారని ఆరోపిస్తోంది. స్కిల్ డవలప్ మెంట్ కేసు ఇంకా కొలిక్కి రాలేదు. బెయిలూ దొరకడం లేదు. కొత్త కొత్త కేసులు చుట్టుముడుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు జైలు నుంచి ఎప్పటికి బయటకు వస్తారో తెలియని పరిస్థితి ఏర్పడింది. దీంతో పార్టీని నడపడం ఓ సవాల్ గా మారింది. తనయుడు నారా లోకేశ్ తనదైన శైలిలో రాజకీయాలు చేస్తున్నా.. పార్టీకి పెద్ద దిక్కుగా భువనేశ్వరి ఉంటే బావుంటుందనే చర్చ జరుగుతోంది.
ఎన్టీఆర్ చేతిలో నుంచి చంద్రబాబు చేతిలోకి వచ్చిన పార్టీ టీడీపీ. ఇప్పుడు చంద్రబాబు జైలులో ఉండడంతో మళ్లీ ఎన్టీఆర్ ఫ్యామిలీ చేతుల్లోకి పార్టీ వెళ్లిపోతుందనే చర్చ, అనుమానాలు మొదటి నుంచీ నడుస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఫ్యామిలీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు సతీమణి, ఎన్టీఆర్ కుమార్తెకు భువనేశ్వరికి టీడీపీ పగ్గాలు అప్పగించాలని యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆమె గత యాభై రోజులుగా ఏపీలోనే ఉంటున్నారు. జనంలో ఉంటున్నారు. టీడీపీ క్యాడర్ తో మమేకం అవుతున్నారు. నిజం గెలవాలి అంటూ ఆమె యాత్రకు కూడా శ్రీకారం చుట్టారు. అలా టీడీపీలో ఆమె పాత్ర రోజురోజుకు పెరిగిపోతోంది. బస్సు యాత్రలకూ శ్రీకారం చుట్టారు. భువనేశ్వరి వర్తమానంలో జరుగుతున్న అనేక రాజకీయ అంశాల మీద స్పందిస్తున్నారు. విజయనగరం రైలు ప్రమాదం మీద రియాక్ట్ అయ్యారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియచేశారు. ఇపుడు ఆమె నేరుగా బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు విజయనగరం జిల్లాకు వస్తున్నారు. వారిని స్వయంగా కలసి భరోసా ఇస్తారని అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో పార్టీకి ప్రెసిడెంట్ గా అచ్చెన్నాయుడు ఉన్నారు. అలాగే యనమల రామక్రిష్ణుడు సహా ఇతర సీనియర్ నేతలు ఉన్నారు. అయినా భువనేశ్వరే ఇపుడు పార్టీ లో కీలక పాత్ర పోషిస్తున్నారు. మరోవైపు వైసీపీ వర్గాలు భువనేశ్వరి పాత్ర హోదా టీడీపీలో ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు. టీడీపీ అంతర్గతంగా దివాళా తీసిందని హాట్ కామెంట్స్ చేశారు. అందుకే రైల్వే క్షతగాత్రుల పరామర్శకు భువనేశ్వరి వెళుతున్నారని కూడా సజ్జల విమర్శించారు. ఇక భువనేశ్వరి టీడీపీ అధ్యక్షురాలు కానున్నారా అని సజ్జల ప్రశ్నించారు. అసలు నారా లోకేష్ ఏమయ్యాడు, ఎందుకు దూరం పెడుతున్నారని కూడా సజ్జల రామకృష్ణారెడ్డి అంటున్నారు. ఇవన్నీ చూస్తూంటే టీడీపీలో ఏదో కీలక మార్పు జరగనుందనే ప్రచారం జరుగుతోంది. అది ఇదేనా.. కాదా.. అనేది తెలియాల్సి ఉంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ