ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సినిమాటోగ్రఫీ చట్ట సవరణ బిల్లుకు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో సినిమా టికెట్ల ఆన్లైన్ విక్రయాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రైల్వే టికెట్లు విక్రయిస్తున్న ఐఆర్సీటీసీ తరహాలో సినిమా టికెట్ల విక్రయాల కోసం ప్రభుత్వ పరిధిలో నడిచే ప్రత్యేక వ్యవస్థను (ఆన్లైన్ ప్లాట్ఫాం) అందుబాటులోకి తీసుకురానుంది. ఈ మేరకు ఆదివారం నాడు జీవో నెం.142 ను ప్రభుత్వం జారీ చేసింది. సినిమా టికెట్ల ఆన్లైన్ విక్రయాల బాధ్యతలను ఏపీ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్, థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎఫ్టీవీటీడీసీ)కి అప్పగిస్తునట్టుగా ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
ముందుగా ప్రజలందరికి అందుబాటులో ఉండేలా టికెట్ల ధరను తీసుకురావడం, పారదర్శక విధానంలో భాగంగా సినిమా టికెట్ల విక్రయాల కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి, కమిటీ సూచనల మేరకు ఆన్లైన్ ప్లాట్ఫాంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ అంశంపై తెలుగు సినీ పరిశ్రమ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ సహా పలువురు సినీరంగ ప్రతినిధులతో కూడా ప్రభుత్వం చర్చించి అభిప్రాయాలు తీసుకుంది. ప్రభుత్వం రూపొందించే ప్రత్యేక వ్యవస్థ అతిత్వరలోనే ప్రజలకు అందుబాటులోకి రానున్నట్టు తెలుస్తుంది. మరోవైపు టికెట్ విక్రయాలకు సంబంధించిన ఈ ప్రభుత్వ వ్యవస్థ అందుబాటులోకి వస్తే, ఇప్పటివరకు ప్రైవేటు ప్లాట్ఫాంల ద్వారా ఆన్లైన్ లో కొనసాగుతున్న సినిమా టికెట్ అమ్మకాలకు ఇకపై అవకాశం ఉండదని తెలుస్తుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ