ఆంధ్రప్రదేశ్ లో వినాయకచవితి పండుగ ఉత్సవాల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ ముప్పు నేపథ్యంలో ఈ సంవత్సరం వినాయకచవితి పండుగను ప్రజలు వారి ఇళ్లలోనే జరుపుకోవాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. ముందుగా పండుగ నిర్వహణపై పలు శాఖలతో బుధవారం నాడు మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం రాష్ట్రంలో వినాయకచవితి ఉత్సవాల నిర్వహణకు సంబంధించి కీలక ప్రకటన విడుదల చేశారు.
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలో బహిరంగ ప్రదేశాల్లో విగ్రహాల ఏర్పాటు, వేడుకల నిర్వహణ, సామూహిక ఊరేగింపుకు అనుమతి లేదని ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజలంతా ఇళ్లలోనే పూజలు నిర్వహించుకోవాలని సూచించారు. అలాగే రాష్ట్రంలో దేవాదాయ శాఖ ఆదీనంలో గల ఆలయాలు, ఇతర ట్రస్ట్ ఆధ్వర్యంలో నడిచే ఆలయాల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలు అనుసరించి వేడుకలు నిర్వహించాలన్నారు. పరిమితంగా 10 మందితో సామాజిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించి పూజలు నిర్వహించాలని సూచించారు. పండుగ సామగ్రి కొనుక్కునే సమయంలో కూడా మార్కెట్ల వద్ద కరోనా నిబంధనలు పాటించాలని చెప్పారు. ప్రస్తుత పరిస్ధితుల్లో వేడుకలకు అనుమతిస్తే వైరస్ వ్యాప్తి ప్రభావం మరింత పెరిగే అవకాశమున్నందువలనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకునట్లుగా తెలుస్తుంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu