కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లాక్డౌన్ విధించిన నేపథ్యంలో మార్చ్ 22 వ తేదీ నుంచి ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమైన సంగతి తెలిసిందే. అయితే అతి త్వరలోనే ఏపీలో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కనున్నట్టు సమాచారం. మే 17 తో దేశవ్యాప్తంగా మూడో విడత లాక్డౌన్ కూడా ముగియనుంది. కొత్త నియమాలు, మరికొన్ని కీలక సడలింపులతో లాక్డౌన్-4 అమలులోకి రానున్న నేపథ్యంలో రాష్ట్రంలో ప్రజారవాణాపై అధికారులు దృష్టి సారించారు. ఈ మేరకు ఆర్టీసీ వైస్ చైర్మన్, ఎండీ మాదిరెడ్డి ప్రతాప్ రాష్ట్రంలోని పలుప్రాంతాల ఆర్ఎంలకు మే 18వ తేదీ కల్లా బస్సులను తిరిగి నడిపేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.
ప్రయాణీకులు భౌతిక దూరం పాటించేలా ఆర్టీసీ బస్సుల్లో ప్రత్యేక సీటింగ్ను ఏర్పాటు చేసి, మొదటి దశలో కొన్ని ప్రాంతాల్లో బస్సులు నడిపేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. అలాగే బస్సులో కేవలం 50 శాతం మంది ప్రయాణికులకే అనుమతి ఇవ్వనున్నారు. బస్సు టికెట్లు కూడా ఆన్లైన్ ద్వారానే బుక్ చేసుకునేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu