ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోక కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని అమరావతి ప్రాంతంలో జరిగిన ఇన్సైడర్ ట్రేడింగ్, ఇతర భూ అక్రమాలపై దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గతంలో అమరావతి భూములపై అధ్యయనం కోసం నియమించిన మంత్రి వర్గ ఉప సంఘం ఇచ్చిన నివేదిక ఆధారంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు మార్చ్ 23, సోమవారం నాడు రాష్ట్ర హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఉత్తర్వులు జారీ చేశారు.
ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజధాని అమరావతి కోసం సేకరించిన భూములలో పెద్దఎత్తున అక్రమాలు, ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని పేర్కొంటూ అధ్యయనం కోసం మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమించింది. అనంతరం మంత్రివర్గ ఉప సంఘం అన్ని రికార్డులను పరిశీలించి డిసెంబర్ 27, 2019న ఒక నివేదిక ఇచ్చింది. రాజధాని ప్రాంతంలో జూన్ 2014 నుంచి డిసెంబర్లోపు ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 4,069.94 ఎకరాల భూ కుంభకోణం జరిగినట్టుగా నివేదికలో వెల్లడించారు. తాజాగా ఈ నివేదిక ఆధారంగానే ఈ అంశంపై సీబీఐ దర్యాప్తునకు ప్రభుత్వం ఆదేశించింది.