ప్రధాని నరేంద్ర మోదీ మార్చ్ 24, మంగళవారం సాయంత్రం 8 గంటలకు మరోసారి జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. దేశంలో కోవిడ్ -19 (కరోనా వైరస్) రోజురోజుకి మరింత విజృంభిస్తున్న నేపథ్యంలో 32 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు పూర్తిస్థాయిలో లాక్డౌన్ ప్రకటించాయి. ఇలాంటి పరిస్థితులలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన నియమాలపై ప్రధాని మోదీ జాతికి మరోసారి సందేశాన్ని ఇవ్వనున్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రజలతో ముఖ్యమైన విషయాలను పంచుకుంటానని ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.
మార్చి 19 న ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించి కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా దేశ ప్రజలంతా స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూ పాటించాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో మార్చ్ 22 ఆదివారం నాడు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జనతా కర్ఫ్యూను ప్రజలంతా పాటించారు. అయితే కర్ఫ్యూ అనంతరం రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన లాక్డౌన్ లను దేశ ప్రజలు సీరియస్ గా తీసుకోవడం లేదని ప్రధాని మోదీ సోమవారం నాడు అసహనం వ్యక్తం చేశారు. ప్రజలంతా తప్పనిసరిగా లాక్డౌన్ ఆంక్షలను, సూచనలను పాటించాలని ఆయన కోరారు. ప్రభుత్వ ఆదేశాలు పాటించడం ద్వారా మిమ్మల్ని, మీ కుటుంబాలను కాపాడుకోవాలంటూ ట్విట్టర్ వేదికగా సూచించారు.