ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ప్రకటించినట్లు రాష్ట్రంలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలు, బ్యానర్లను నిషేధం నేటినుంచి (నవంబర్ 1, 2022) అమల్లోకి రానున్న నేపథ్యంలో.. తాజాగా దానిని వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నిషేధం అమలుకు సమయం ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఫ్లెక్సీ తయారీదారులు చేసిన అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. దీనిపై సానుకూలంగా స్పందించిన సీఎం జగన్, ప్లాస్టిక్ ఫ్లెక్సీల తయారీదారులకు సాంకేతిక పరిజ్ఞానం అందించాలని అధికారులకు సూచించారు. అలాగే ప్లాస్టిక్ ఫ్లెక్సీల రద్దును జనవరి 26 నుంచి అమలు చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
ఏపీలోని ప్లాస్టిక్ ఫ్లెక్సీల తయారీదారులు ప్రభుత్వ నిర్ణయానికి మద్దతు తెలపాలని, ఇకపై ప్లాస్టిక్ కాకుండా క్లాత్ వినియోగంపై దృష్టి సారించాలని సీఎం జగన్ కీలక సూచన చేశారు. ఇక జనవరి 26 నుంచి నిషేధం అమలులోకి రానున్న క్రమంలో కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు తీసుకోవాలని, అలాగే తయారీ ప్రక్రియలకు అవసరమైన శిక్షణ ఇవ్వడంలో సాయపడాలని సంబంధిత అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. అంతేకాకుండా తయారీదారులు పరికరాలను కొనుగోలు చేసేందుకు వీలుగా ప్రభుత్వం తరపున పావలా వడ్డీ పథకం కింద రూ. 20 లక్షల వరకు రుణాలు మంజూరు చేయాలని కూడా సీఎం జగన్ ఆదేశించారు.
కాగా పర్యావరణ పరిరక్షణకు తీసుకునే చర్యల్లో భాగంగా 2027 నాటికి ఆంధ్రప్రదేశ్ను ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా మార్చాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం ప్లాస్టిక్ ఫ్లెక్సీలను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. నవంబర్ 1 నుంచి నిషేధం అమల్లోకి వస్తుందని, నిబంధనలు అతిక్రమిస్తే ఫ్లెక్సీలకు రూ.100 జరిమానా విధిస్తామని వార్నింగ్ కూడా ఇచ్చింది. ప్లాస్టిక్ ఫ్లెక్సీలు, బ్యానర్ల తయారీ, దిగుమతులతోపాటు ప్రింటింగ్, వినియోగం, రవాణా, ప్రదర్శన వంటి వాటికి కూడా నిషేధాజ్ఞ వర్తిస్తుందని సదరు నోటిఫికేషన్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్లాస్టిక్ ఫ్లెక్సీలు, బ్యానర్లకు బదులు కాటన్, నేసిన బట్టలనే అలవాటు చేసుకోవాలని నోటిఫికేషన్లో వివరించారు. అయితే తాజాగా ఈ ఉత్తర్వుల అమలును వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE