ఆంధ్రప్రదేశ్ హైకోర్టును అమరావతి నుంచి కర్నూల్కు తరలించాలనే ప్రతిపాదన కేంద్రానికి అందిందని న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం లోక్సభలో హైకోర్టు తరలింపు అంశంపై వైసీపీ ఎంపీలు కోటగిరి శ్రీధర్, చింతా అనురాధాలు అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి కిరణ్ రిజిజు సమాధానం ఇచ్చారు. ఇక కర్నూల్కు హైకోర్టు తరలింపు అంశం గురించి ముందుగా హైకోర్టుతో సంప్రదింపులు జరిపి రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. అలాగే హైకోర్టు నిర్వహణ వ్యయాన్ని మొత్తం రాష్గ్ర ప్రభుత్వమే భరిస్తుంది. హైకోర్టును తరలించే అంశమై రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు కలిసి ఒక నిర్ణయానికి రావాలని, ఆ తర్వాతే దానికి సంబంధించిన ప్రతిపాదన కేంద్రానికి పంపాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. ఇక ఏపీ హైకోర్టులో ఖాళీగా ఉన్న న్యాయమూర్తుల పోస్టుల భర్తీకి చర్యలు ప్రారంభించామని కేంద్రమంత్రి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జూలై 15, 2022 నాటికి 2,35,617 కేసులు పెండింగ్లో ఉన్నాయని, మొత్తం కేసులలో 42,374 వరకు కేసులు గత 10 సంవత్సరాలకు పైగా పెండింగ్లో ఉన్నాయని రిజిజు పేర్కొన్నారు. తాజాగా ఏడుగురు న్యాయమూర్తులను కేటాయించామని, మరో ఎనిమిది మంది న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సుపై విచారణ జరుగుతోందని రిజిజు సభకు తెలియజేశారు. దీనికి రాష్ట్ర మరియు కేంద్ర స్థాయిలోని వివిధ రాజ్యాంగ అధికారులతో సంప్రదింపులు మరియు ఆమోదం అవసరమని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న ఖాళీలను త్వరితగతిన భర్తీ చేయడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ, పదవీ విరమణ లేదా న్యాయమూర్తుల పదోన్నతి కారణంగా మరియు వారి సంఖ్య పెరగడం వల్ల కూడా హైకోర్టులలో న్యాయమూర్తుల ఖాళీలు భారీగా ఉంటున్నాయని కిరణ్ రిజిజు అన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ