గ్రామ, వార్డు సచివాలయాల్లో శాశ్వత ఉద్యోగాలకు సంబంధించిన మెరిట్ జాబితాను జిల్లాలవారీగా ఆన్లైన్లో ఉంచినట్టు పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ వెల్లడించారు. మెరిట్ జాబితా తయారీలో రాష్ట్ర విధానాలను పాటించామని, రోస్టర్, రిజర్వేషన్స్ ఆధారంగా అన్ని జిల్లాలకు అభ్యర్థుల మెరిట్ జాబితాను తయారు చేసినట్లు తెలిపారు. మెరిట్ లిస్ట్ లో ఉన్న అభ్యర్థులకు ఎస్సెమ్మెస్ల ద్వారా సమాచారం ఇచ్చినట్టు పేర్కొన్నారు. సెప్టెంబర్ 24, మంగళవారం నుంచి జిల్లాల్లో ఎంపికైన అభ్యర్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లు వెరిఫికేషన్ జరుగుందని, ఆన్లైన్ నుంచి కాల్ లెటర్లు డౌన్ లోడ్ చేసుకుని వెరిఫికేషన్ అప్పుడు తీసుకురావాలని అభ్యర్థులకు గిరిజా శంకర్ సూచించారు.
ఎంపికైన అభ్యర్థులు సర్టిఫికెట్లు వెరిఫికేషన్ కోసం ఎక్కడికి వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి వంటి వివరాల సమాచారాన్ని వారికీ ముందుగానే తెలియజేస్తున్నట్టు అధికారులు చెప్తున్నారు. ఏదైనా అనుకోని కారణాలతో నిర్ణయించిన సమయంలో సర్టిఫికెట్లు వెరిఫికేషన్ కోసం హాజరుకాని వారి కోసం మరొక అవకాశం ఇవ్వనున్నారు. ఈ నెల 27వ తేదీ నుంచి అభ్యర్థులకు అపాయింట్మెంట్ ఆర్డర్లు జారీచేయనున్నారు. అక్టోబర్ 2వ తేదిలోపే ఈ కార్యక్రమాలు పూర్తి చేసి గ్రామ, వార్డు సచివాలయాలను అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా అధికారులకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు పంపించారు. మొదటగా అక్టోబర్ 1,2 తేదీల్లో వారికీ అవగాహనా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నారు, తిరిగి రెండో విడతలో దశలవారీగా అక్టోబర్ 14 నుంచి నవంబర్ 15 మధ్య ఉద్యోగులకు శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నారు.
[subscribe]