తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సెప్టెంబర్ 23, సోమవారం సాయంత్రం ప్రగతి భవన్ లో సమావేశమయ్యారు. గోదావరి జలాలు శ్రీశైలానికి తరలింపు, రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 లోని పరిష్కారం కాని అంశాలు, తొమ్మిది, పదవ షెడ్యూల్ లోని సంస్థల యొక్క ఆస్తులు మరియు అప్పుల పంపకం, ఆంధ్రప్రదేశ్ కు రావాల్సిన విద్యుత్ పెండింగ్ బిల్లులు వంటి అంశాలతో పాటు ఇతర అంశాలపై కూడ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించబోతున్నారు.
ప్రగతి భవన్ వేదికగా జరుగుతున్నా ఈ సమావేశానికి ఇరు రాష్ట్రాల మంత్రులు, ఉన్నతాధికారులు, నీటిపారుదల రంగానికి చెందిన ప్రధాన ఇంజినీర్లు కూడ పాల్గొన్నారు. మొదటిసారిగా జూన్ 28, 2019న కేసీఆర్, వైఎస్ జగన్ సమావేశమయ్యారు, అనంతరం మళ్ళీ ఆగష్టు 2, 2019న రెండోసారి సమావేశమై పలు అంశాలపై చర్చలు జరిపారు. గతంలో గోదావరి జలాల తరలింపుపై చర్చించగా, ముఖ్యమంతుల ఆదేశాల మేరకు రెండు రాష్ట్రాల ఇంజినీర్ల కమిటీలు ఉమ్మడిగా మరియు విడివిడిగా చర్చలు జరిపారు, వారు కొన్ని ప్రతిపాదనలు రూపొందించి వివరించగా, వాటిపై కేసీఆర్, వైఎస్ జగన్ ఈ రోజు నిర్ణయాలు తీసుకోనున్నారు. మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వ అనుసరిస్తున్న విధానాలు, నిధుల విడుదల తదితర అంశాలపై చేపట్టాల్సిన కార్యాచరణపై కూడ ఈ సమావేశంలో చర్చలు జరిగే అవకాశం ఉంది.
[subscribe]