ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలకు తోడు ఎగువన ఉన్న తెలంగాణ నుంచి కూడా భారీ వరద చేరుతోంది. ఈ క్రమంలో రాజమహేంద్రవరం సమీపంలోని ధవళేశ్వరం (సర్ ఆర్థర్ కాటన్) బ్యారేజీ వద్ద వరద ప్రవాహం గురువారం ఉదయానికి 15.82 లక్షల క్యూసెక్కులకు పెరిగింది. తెలంగాణలోని భద్రాచలం ఎగువన వరద నీరు విడుదల 17 లక్షల క్యూసెక్కులను దాటడంతో, సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీకి కూడా ఇన్ఫ్లో భారీగా చేరుకుంటోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇక్కడ రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుండగా, గురువారం సాయంత్రానికి మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేస్తామని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (రెవెన్యూ-డిజాస్టర్ మేనేజ్మెంట్) జి సాయి ప్రసాద్ తెలిపారు.
బ్యారేజీకి సమీపంలోని లంక గ్రామాలపై దీని ప్రభావం పడుతోంది. ఇప్పటికే పలు లంక గ్రామాల చుట్టూ వరద నీరు చుట్టుముట్టింది. కోనసీమ జిల్లాలోని పి.గన్నవరం నియోజకవర్గంలో గోదావరి నదీపాయలు ఉదృతంగా ప్రవహిస్తుండటంతో దాదాపు 21 లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. అలాగే మరో 30 గ్రామాలను వరద ముంచెత్తనుంది. మొత్తం కోనసీమ పరిధిలో గల 18 మండలాల్లోని దాదాపు 51 గ్రామాలకు వరద ప్రభావం అధికంగా ఉంది. దీంతో ప్రజలు ఆందోళనకు లోనవుతుండగా, అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజల తరలింపుకు చర్యలు ప్రారంభించారు. జలవనరుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్తో కలిసి రాష్ట్ర విపత్తు నియంత్రణ అధికారులు వరద ప్రభావంపై పర్యవేక్షిస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ