జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఏప్రిల్ 3న తిరుపతి లోక్సభ ఉపఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు ప్రకటించారు. బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్ధి రత్నప్రభకు మద్దతుగా తిరుపతి పట్టణంలోని ఎమ్.ఆర్.పల్లి సర్కిల్ నుంచి ఏఐఆర్ బైపాస్ మీదుగా శంకరంబాడి సర్కిల్ వరకు కవాతు చేస్తారని తెలిపారు. ఏపీ రాజకీయాల్లో బీజేపీ-జనసేన పొత్తు మంచి ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందనే విశ్వాసం ప్రజల్లో కల్పించే విధంగా ఈ కవాతు ఉంటుందని చెప్పారు. సాయంత్రం మూడు గంటలకు ఈ కార్యక్రమం మొదలవుతుందని, పాదయాత్ర అనంతరం శంకరంబాడి సర్కిల్ వద్ద భారీ బహిరంగసభ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
మంగళవారం సాయంత్రం రేణిగుంట విమానాశ్రయంలో నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడారు. “పవన్ కళ్యాణ్ కు ఘనస్వాగతం పలికేందుకు బీజేపీ కూడా ఎదురు చూస్తోంది. ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఇందుకోసం ప్రత్యేకంగా కమిటీ కూడా వేశారు. పవన్ కళ్యాణ్ పర్యటనను విజయవంతం చేయడానికి బీజేపీ కూడా శాయశక్తుల కృషి చేస్తోంది. ఈ కార్యక్రమానికి మీడియా మిత్రులను కూడా ఆహ్వానిస్తున్నాము. బీజేపీ, జనసేన పొత్తుపై అనేక అనుమానాలు, అపోహలు, అసత్యాలు సృష్టించి ప్రత్యర్ధులు దుష్ప్రచారం చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలకు మేలు చేయడానికే రెండు పార్టీల కలయిక జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ మంచి నాయకుడిగా ఎదగడమే కాకుండా, ప్రజల్లో విశ్వాసం నింపే విధంగా పనిచేస్తారు” అని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ