ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో తప్పనిసరిగా ఇంగ్లీష్ మీడియం అమలు చేయాలనీ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అమలు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఇంగ్లీష్ మీడియాన్ని తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను రాష్ట్ర హైకోర్టు రద్దు చేసింది. ఈ అంశంపై ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.81,85 ను రద్దు చేస్తూ ఏప్రిల్ 15, బుధవారం నాడు కోర్టు తీర్పు వెలువరించింది.
ముందుగా ఇంగ్లీష్ మీడియం అమలుపై ప్రభుత్వం జారీ చేసిన జీవోలను సవాల్ చేస్తూ బీజేపీ నాయకుడు సుదీష్ రాంబొట్ల మరియు గుంటుపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తులు హైకోర్టులో పిటిషన్లు వేశారు. ఇటీవలే విచారణ జరిగిన సమయంలో పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టులో వాదిస్తూ, ఏ మాధ్యమంలో చదువుకోవాలనే విషయాన్ని విద్యార్థుల నిర్ణయానికే వదిలివేయాలని, ఇంగ్లీష్ మీడియాన్ని తప్పనిసరి చేయడం సరికాదని పేర్కొన్నారు. అలాగే ఈ అంశంపై ప్రభుత్వ తరఫు న్యాయవాది వాదిస్తూ ఇంగ్లీష్ మీడియం విద్యార్థుల భవిష్యత్కు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్లో ఉంచింది. ఈరోజు జీవో నెం.81,85 లను రద్దు చేస్తూ కోర్టు తీర్పు వెలువరించింది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu