విశాఖపట్నం నగరంలోని ఎల్.జి.పాలిమర్స్ పరిశ్రమ నుండి రసాయన వాయువు లీకేజ్ వలన భారీ ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో స్టెరైన్ వాయువు పీల్చడం వలన తీవ్ర అస్వస్థతకు గురై ఇప్పటికే 9 మంది మృతి చెందినట్లుగా తెలుస్తుంది. అలాగే దాదాపు 200 మందికి పైగా ప్రజలు అస్వస్థతకు గురై వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ గ్యాస్ లీక్ దుర్ఘటనపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పందించింది. జనం నివసించే చోట ఈలాంటి పరిశ్రమ ఇంకా ఎందుకు ఉందని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ సంఘటనకు సంబంధించి ఏపీ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిని కోర్టు సహాయకుడిగా నియమించింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది.
మరోవైపు గ్యాస్ లీక్ ఘటన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విశాఖపట్నం చేరుకొని బాధితులను పరామర్శించారు. ఈ ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ముందుగా కేజీహెచ్లో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను సీఎం వైఎస్ జగన్ పరామర్శించి ఓదార్చారు. వారికీ వైద్య సదుపాయాల గురించి అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu