విశాఖపట్నం నగరంలోని ఎల్.జి.పాలిమర్స్ పరిశ్రమ నుండి రసాయన వాయువు లీకేజ్ వలన భారీ ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో రసాయన వాయువు వలన తీవ్ర అస్వస్థతకు గురై ఇప్పటికే 9 మంది మృతి చెందినట్లుగా సమాచారం. అలాగే దాదాపు 200 మందికి పైగా ప్రజలు అస్వస్థతకు గురై వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విశాఖపట్నం చేరుకొని గ్యాస్ లీక్ ఘటన బాధితులను పరామర్శించారు. ఈ ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ముందుగా కేజీహెచ్లో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను సీఎం వైఎస్ జగన్ పరామర్శించి ఓదార్చారు. వారికీ అందుతున్న వైద్య సదుపాయాల గురించి అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
గ్యాస్ లీక్ ఘటనలో తీవ్ర అస్వస్థకు గురైన బాధితులందరికీ మెరుగైన వైద్యాన్ని అందించాలని సీఎం జగన్ ఆదేశించారు. గ్యాస్ లీకేజ్ ఘటన తీవ్ర ఆవేదన కలిగిందని, ప్రజలు ప్రాణాలు కోల్పోవడం బాధాకరంగా ఉందని సీఎం జగన్ విచారం వ్యక్తం చేశారు. ప్రజలు భయపడవద్దని, ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉండి ఆదుకుంటుందని బాధితులకు సీఎం భరోసా ఇచ్చారు. అనంతరం కేజీహెచ్లోనే అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి ఘటనపై పూర్తీ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ గ్యాస్ లీకేజ్ వలన బాధితులకు దీర్ఘకాలంగా ఉండే ఇబ్బందులు, వారికి అందించే చికిత్స విధానంపై వైద్యులుతో సీఎం వైఎస్ జగన్ చర్చించారు.
అనంతరం సీఎం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ ఈ దుర్ఘటనకు సంబంధించి పూర్తిస్థాయిలో అధ్యయనం చేసేందుకు ఓ కమిటీని వేసినట్టు తెలిపారు. అతి త్వరలోనే నివేదిక సమర్పించాలని ఆదేశాలిచ్చినట్టు పేర్కొన్నారు. భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై కూడా ఈ కమిటీ నివేదిక ఇస్తుందని చెప్పారు. ఘటనలో మృతి చెందిన వారికీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ దుర్ఘటనలో చనిపోయిన మనుషులను వెనక్కి తీసుకురాలేమని, బాధితుల కుటుంబాలను అన్నిరకాలుగా ఆదుకుంటామని చెప్పారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ప్రతి కుటుంబానికి కోటి రూపాయలు ఆర్థిక సాయం అందిస్తామని సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu
[subscribe]