ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రోజురోజుకూ దిగజారి పోతున్నాయని, ప్రతిపక్షాలు కావాలనే తనపై తప్పుడు ఆరోపణలు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు. ఈ మేరకు ఆయన తాను ప్రాతినిథ్యం వహిస్తున్న సత్తెనపల్లి నియోజకవర్గంలో ఆత్మహత్య చేసుకున్న వ్యక్తుల కుటుంబాలకు మంజూరైన పరిహారంలో తాను లంచం ఆశించినట్లుగా వస్తున్న ఆరోపణలపై స్పందించారు. మంగళవారం దీనిపై మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సత్తెనపల్లి నియోజకవర్గంలో ఆత్మహత్య చేసుకున్న రైతులు 12మంది ఉన్నారని, వారికి ఒక్కొక్కరికి రూ.7 లక్షలు చొప్పున మొత్తం రూ.84 లక్షలు చెల్లించిందని తెలిపారు. ఇవి సకాలంలో అందేలా స్థానిక ఎమ్మెల్యేగా, బాధ్యత గల మంత్రిగా తాను చొరవ చూపానని అన్నారు.
ఇక పదవిని అడ్డుపెట్టుకుని తాను ఎక్కడా అవినీతికి పాల్పడటం లేదని, అయితే టీడీపీ, జనసేన పార్టీలు మాత్రం తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. శవ రాజకీయాలు చేసే స్థాయికి తాను దిగజారలేదని, పరిహారం సొమ్ముల కోసం పాకులాడే వాడిని కానని వారు తెలుసుకోవాలని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబుకు మేలు చేసేలా జనసేనాని పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్నారని, వారి పార్టీ కార్యకర్తలు మరణిస్తే పట్టించుకోని వారు తనపై బురద జల్లుతున్నారని అంబటి రాంబాబు మండిపడ్డారు. చనిపోయిన వ్యక్తికీ ఇచ్చే పరిహారంలో రూ.2 లక్షలు అడిగినట్లుగా తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని, అలాంటి పరిస్థితి వస్తే మంత్రి పదవినే వదులుకుంటానని మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ