హైదరాబాద్ మెట్రో అధికారులతో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్లోని దిల్ కుషా అతిథి గృహంలో ఫిబ్రవరి 15, శనివారం నాడు జరిగిన ఈ సమీక్షా సమావేశానికి ఎల్ అండ్ టీ ఎండీ కేవీబీ రెడ్డి, మెట్రో ప్రాజెక్టు డైరెక్టర్ ఎంపీ నాయుడు, జీఎం రాజేశ్వర్, ఎల్టీఎంఆర్హెల్ఎల్, హెచ్ఎంఆర్ఎల్ అధికారులు, తదితరులు హాజరయ్యారు. మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఈ సమావేశానికి హాజరు కాలేదు. ఈ సమీక్ష సందర్భంగా మెట్రో అధికారులపై కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఫిబ్రవరి 7న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా జరిగినా జేబీఎస్ – ఎంజీబీఎస్ మెట్రో కారిడార్ ప్రారంభోత్సవానికి తనను ఆహ్వానించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తను ఎంపీగా ఎన్నికైన సికింద్రాబాద్ నియోజకవర్గపరిధిలో ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహిస్తే తనకు ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు.
కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండానే మెట్రో ప్రాజెక్టును నిర్మించారా అని కిషన్ రెడ్డి అధికారులను నిలదీసినట్టుగా తెలుస్తుంది. కేంద్రం నిధులు ఇస్తున్నా కూడా ప్రధాని నరేంద్రమోదీ ఫోటో ఎందుకు పెట్టలేదని ప్రశ్నించినట్టు సమాచారం. ఈ ప్రాజెక్టుకు రూ.1458 కోట్లు ఇవ్వడానికి కేంద్రప్రభుత్వం అంగీకరించిందని, ఇప్పటికే రూ.1200 కోట్లు ఇవ్వగా, ఇంకా రూ.258 కోట్ల నిధుల ఇవ్వాల్సి ఉందని గుర్తు చేశారు. ఎల్ అండ్ టీ సంస్థ ఇకపై అనుమతులు, ఫండ్స్ కోసం కేంద్రాన్ని సంప్రదించవద్దని కిషన్ రెడ్డి అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. సమీక్ష అనంతరం మెట్రో అధికారులతో కలిసి కిషన్ రెడ్డి జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు మెట్రో రైల్లో ప్రయాణించారు. కిషన్ రెడ్డితో పాటుగా పలువురు తెలంగాణ బీజేపీ నేతలు మెట్రో రైల్లో ప్రయాణించారు.
[subscribe]