నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యే అభ్యర్ధిగా మేకపాటి విక్రమ్ రెడ్డి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా బీ ఫారం అందుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈరోజు ఉదయం పట్టణం లోని బైపాస్ రోడ్డులో గల అభయాంజనేయ స్వామి ఆలయంలో విక్రమ్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నెల్లూరు సెంటర్ మీదుగా ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు.
ఈ సందర్భంగా విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ.. నా నామినేషన్కు వైసీపీ నాయకులు, కార్యకర్తలు అందరూ రావడం సంతోషం కలిగిస్తోందని తెలిపారు. ఈ ఎన్నికలు తనకు కొత్త అయినప్పటికీ సీరియస్గా తీసుకుని పని చేస్తానని, ఆత్మకూరు అభివృద్ధికి తన వంతు బాధ్యతగా కృషి చేస్తానని తెలిపారు. అయితే ఈ స్థానానికి దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణంతో ఎన్నికలు జరగనుండగా.. ఆయన సోదరుడు మేకపాటి విక్రమ్ రెడ్డి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. జూన్ 23వ తేదీన ఉప ఎన్నిక జరుగనుండగా, 26వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి.
కాగా అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డితో పాటు పలువురు స్థానిక వైసీపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలినేని శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. దశాబ్దాలుగా రాజకీయాల్లో కొనసాగుతున్నా మేకపాటి కుటుంబంపై ఎలాంటి మచ్చ లేదని, 2024 ఎన్నికల్లో సాధించిన మెజారిటీ కన్నా ఈ ఉపఎన్నికలో లక్ష ఓట్ల మెజారిటీ తెచ్చి గౌతమ్ రెడ్డికి ఘన నివాళి ఇస్తామని పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF