ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల మరియు ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఈరోజు (సోమవారం) కన్నుమూశారు. ఈ ఉదయం గుండెపోటు రావడంతో.. కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను హైదరాబాద్ లోని అపోలో హాస్పిటల్ కి తరలించారు. అక్కడ వైద్యులు ఐసీయూలో ఉంచి గౌతమ్ రెడ్డికి చికిత్స అందించారు. అయితే, గుండెపోటు తీవ్రత ఎక్కువగా ఉండటంతో చికిత్స అందించినా ప్రయోజనం లేకపోయింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం నుంచి గౌతమ్ రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కాగా, కేవలం 50 సంవత్సరాల వయసులోనే ఆయన ఇలా హఠాత్తుగా కన్నుమూయటం అందరిని షాక్ కి గురిచేస్తోంది.
నెల్లూరు జిల్లా రాజకీయాలలో ఎంతో పేరున్న మేకపాటి కుటుంబం నుంచి వచ్చిన గౌతమ్ రెడ్డి.. 2014, 2019 ఎన్నికలలో ఆత్మకూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. రెండవసారి వైసీపీ అధికారంలోకి వచ్చాక సీఎం జగన్ ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు. అయితే, రాజకీయ ప్రాబల్యం ఉన్న నేపథ్యం నుంచి వచ్చినా సరే ఆయనకు రాజకీయాలలో సౌమ్యుడుగా పేరుంది. గౌతమ్ రెడ్డి తండ్రి మేకపాటి రాజమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఎన్నోసార్లు ఎంపీగా గెలుపొందారు. కాగా, గౌతమ్ రెడ్డి మృతిపై సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాగా, గౌతమ్ మృతితో పార్టీలో, జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గత వారం రోజుల నుంచి దుబాయ్ పర్యటనలో ఉన్న గౌతమ్ రెడ్డి ఆదివారమే హైదరాబాద్కు తిరిగొచ్చారు. ఈలోగా ఇలా జరగటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ