ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు సూపర్స్టార్ రజనీకాంత్ చుట్టూ తిరుగుతున్నాయి. ఇప్పటికే అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతలు రజనీకాంత్పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తుండగా.. తాజాగా నటుడు, ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణ మురళి కూడా రియాక్ట్ అయ్యారు. నంది అవార్డులను ఉద్దేశించి ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ చేసిన వ్యాఖ్యలపై నటుడు, ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణ మురళి స్పందించారు. సోమవారం ఆయన విజయవాడలో మాట్లాడుతూ.. ‘సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత నంది అవార్డులు ఇవ్వలేదు అంటున్నారు. అయితే దానికి సరైన కారణాలే ఉన్నాయి. జగన్ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు అవుతోంది. తొలి రెండేళ్లు కరోనా వచ్చింది. దాని నుంచి రాష్ట్ర ప్రజలను కాపాడుకున్నారు. ఆ తర్వాత దేనికి ప్రయారిటీ ఇవ్వాలో దానికి ఇస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు.
ఇంకా పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ.. ‘సీఎం జగన్ అవార్డులు ఇస్తే, ఎవరూ వేలెత్తి చూపని విధంగా పూర్తి పారదర్శకతో ఇస్తారు. ఉత్తమ రౌడీ, ఉత్తమ గూండా అని కాదు.. ఉత్తమ వెన్నుపోటుదారుడు, ఉత్తమ మోసగాడు, ఉత్తమ సన్యాసి.. వంటివి మీ వాళ్ళకే ఇవ్వాలి. రజనీకాంత్ రోజూ చెన్నై నుంచి విజయవాడ వచ్చి చంద్రబాబును పొగుడుకోమనండి.. మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. రజనీకాంత్ తమిళవాళ్లకే సూపర్ స్టార్. తెలుగు వాళ్లకు ఎంతమాత్రం కాదు. మాకూ ఒక సూపర్ స్టార్ ఉన్నారు.. ఆయనే మెగాస్టార్ చిరంజీవి. చిరంజీవి గారికి సీఎం జగన్ అంటే ఎంతో ప్రేమ, అభిమానం. సీఎం జగన్ కూడా ‘అన్నా.. అన్నా’ అంటూ వైఎస్సార్కి ఇచ్చినంత గౌరవం చిరంజీవికి ఇస్తారు’ అని వ్యాఖ్యానించారు.
అసలేమైందంటే.. హైదరాబాద్ లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న నిర్మాతలు సి. అశ్వనీదత్, ఘట్టమనేని ఆదిశేషగిరి రావులు నంది అవార్డ్స్ గురించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం నంది అవార్డులు ఇచ్చే పరిస్థితి లేదు. ఒకవేళ ఇచ్చినా.. ఉత్తమ గూండా, ఉత్తమ రౌడీ వంటి అవార్డులు ఇస్తారు. ఇవి సినిమాలకు అవార్డులు ఇచ్చే రోజులు కావు. సినిమాలకు నంది అవార్డులు ఇచ్చే రోజులు రావాలంటే ఇంకో రెండేళ్లు పడుతుంది. అప్పుడు మనందరం అవార్డులు అందుకోవచ్చు’ అని జగన్ సర్కార్పై నిర్మాత అశ్వనీదత్ పరోక్షంగా విమర్శలు చేశారు. అలాగే మరోవైపు ఆదిశేషగిరి రావు మాట్లాడుతూ.. ఈ రోజుల్లో ప్రభుత్వాలకు అనుకూలంగా ఉన్నవాళ్లకే అవార్డులు ఇస్తున్నారు. తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయాక నంది అవార్డులను పట్టించుకోట్లేదు. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఫిల్మ్ ఇండస్ట్రీని పట్టించుకోట్లేదు. ప్రభుత్వ అవార్డులకు పెద్దగా ప్రాధాన్యత ఉందని నేను అనుకోవట్లేదు’ అని అన్నారు.
కాగా ఇటీవల విజయవాడలో జరిగిన టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) శతజయంతి ఉత్సవాల అంకురార్పణ సభకు ఆయన ప్రత్యేక అతిథిగా హాజరైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ప్రశంసలు కురిపించారు. అయితే దీనిపై ఏపీలోని అధికార పక్ష నేతలు స్పందించారు. కొందరు మంత్రులు, వైఎస్సార్సీపీ లోని కీలక నేతలు రజనీకాంత్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందిస్తూ.. వైసీపీపై కానీ, సీఎం జగన్ మోహన్ రెడ్డిపై కానీ రజనీకాంత్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రతిష్టలు కలిగిన రజనీకాంత్పై ఆ పార్టీ నేతలు హద్దు మీరి మాట్లాడుతున్నారని, దీనికి సీఎం జగన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE