రేపు ‘రథసప్తమి’ పర్వదినం సందర్భంగా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణస్వామి ఆలయంలో వేడుకలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం రథసప్తమి రోజున ఈ ఆలయానికి పెద్దసంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. ఈక్రమంలోనే.. ఇక్కడ సూర్య జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించటానికి ఏర్పాట్లు జరగుతున్నాయి. అధిక సంఖ్యలో ఆదిత్యుడి దర్శనం కోసం వచ్చే భక్తుల కొరకు ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా.. విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి స్వామి స్వాత్మానందేంద్ర సరస్వతి.. అరసవల్లి సూర్యభగవానుడికి రేపు ఉదయం తొలి పూజ చేయనున్నారు. స్వాత్మానందేంద్ర స్వామిజీ మొదటగా సూర్యభగవానుడికి క్షీరాభిషేకం చేయనున్నారు.
ఆ తర్వాత విశేష అర్చనలు, ద్వాదశ హారతి, మహా నివేదన, పుష్పాలంకరణ వంటి మొదలగు సేవలు నిర్వహించనున్నారు. ఈ క్రమంలో.. బుధవారం సాయంత్రం 4 గంటల వరకు వచ్చిన భక్తులకు భానుడి నిజరూప దర్శనం కల్పిస్తారు. అనంతరం రాత్రికి స్వామివారికి ఏకాంతసేవ జరుగుతుంది. రథసప్తమి వేడుకల సందర్భంగా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. మాఘ శుక్ల సప్తమి నాడు సూర్యభగవానుడు తన ఏడు గుర్రాల రథంపై ప్రత్యక్షమై సృష్టి అంతటినీ ప్రకాశవంతం చేశాడని పురాణ విశ్వాసం. దీనిని పురస్కరించుకుని రథసప్తమి రోజున సూర్యభగవానుని జయంతిగా జరుపుకుంటారు.
ఈ పర్వదినాన ఆ సూర్యనారాయణుడిని భక్తి, శ్రద్ధలతో.. నియమ,నిష్టలతో పూజిస్తారు. సూర్యదేవుని అనుగ్రహంతో మానవుడికి ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతానం, సంపదలు లభిస్తాయని భక్తుల విశ్వాసం. అందుకే, భక్తులు ఈ రోజున అరసవల్లి ఆలయానికి వచ్చి ప్రత్యేక పూజలు చేయించుకుంటారు. ఈ నేపథ్యంలో.. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి అరసవల్లి కూడలి వరకు ఆర్టీసీ అధికారులు సుమారు 20 వరకు బస్సులు నడపనున్నారు. అలాగే, భక్తులకు అందించటానికి 70 వేల లడ్డూలు, 2 క్వింటాళ్ల పులిహోరను తయారుచేయనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ