ఎన్నికల వేళ అధికార వైసీపీ స్పీడ్ పెంచేసింది. ముందు నుంచి కూడా మిగతా పార్టీలతో పోల్చుకుంటే దూకుడుగా వెళ్తోన్న వైసీపీ.. ఇప్పుడు మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే నాలుగు అభ్యర్థుల జాబితాలను వైసీపీ హైకమాండ్ ప్రకటించేసింది. పెద్ద సంఖ్యలో సిట్టింగ్లకు ఝలక్ ఇచ్చింది. కొత్త ముఖాలను తెరపైకి తీసుకొచ్చింది. ఇప్పుడు అయిదో జాబితాను కూడా వైసీపీ హైకమాండ్ ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. రేపో, మాపో వైసీపీ అయిదో జాబితా వెలువడే అవకాశాలు ఉన్నాయని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
అయిదో జాబితాలో దాదాపు ఐదుగురు సిట్టింగ్ ఎంపీలను.. పది మంది వరకు ఎమ్మెల్యేను సైడ్ చేసి కొత్త వ్యక్తుల పేర్లను చేర్చినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఈసారి తమకు టికెట్ దక్కదని తెలిసిన నేతలంతా సీఎంవోకు క్యూ కడుతున్నారట. పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు, ఎంపీలు హైకమాండ్ వద్దకు వెళ్లి తమకే టికెట్ కేటాయించాలని కోరుతున్నారట. అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారట. పడరాని పాట్లు పడుతున్నారట.
ప్రస్తుతం గురుజాల నియోజకవర్గానికి కాసు మహేష్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఆయన పనితీరు బాగోలేకపోవడం.. ప్రజాబలం తగ్గిపోవడంతో ఆయన్ను తప్పించేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారట. ఆయన స్థానంలో కొత్త వారిని పోటీ చేయించాలని అనుకుంటున్నారట. ఇప్పటికే కొత్త వ్యక్తి పేరును అయిదో జాబితాలో చేర్చినట్లు తెలుస్తోంది. దీంతో మహేష్ రెడ్డి అధిష్టానం వద్దకు వచ్చి కూర్చున్నారట. వచ్చే ఎన్నికల్లో గురుజాల టికెట్ తనకే ఇవ్వాలని కోరుతున్నారట.
అలాగే అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే, మంత్రి కొట్టు సత్యనారాయణ, కర్నూల్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డిలను కూడా ఈసారి తప్పిస్తారని.. వారికి టికెట్ దక్కదని ప్రచారం జరుగుతోంది. దీంతో వారంతా సీఎంవోకు పరుగులు తీస్తున్నారట. టికెట్ దక్కించుకునేందుకు.. అధిష్టానంతో మంతనాలు జరుపుతున్నారట. మరి వీరిలో ఎంత మందికి టికెట్ దక్కుతుంది?.. ఎంత మందికి నిరాశ ఎదురవుతుందనేది చూడాలి మరి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ