ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మంగళవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఈ రోజు టీడీపీ ఎమ్మెల్యే, ప్రతిపక్ష ఉపనేత అచ్చెన్నాయుడుపై అధికార పక్షం ప్రివిలేజ్మోషన్ ప్రవేశ పెట్టింది. ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్రెడ్డి ప్రివిలేజ్మోషన్ ను అసెంబ్లీలో ప్రవేశపెడుతూ చదివి వినిపించారు. మద్యం అమ్మకాల విషయంలో తప్పుడు సమాచారంతో అచ్చెన్నాయుడు సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని, అందువలనే ఆయన పై ప్రివిలైజ్ మోషన్ ప్రవేశపెడుతున్నామని శ్రీకాంత్రెడ్డి తెలిపారు. ఈ మోషన్ను ప్రివిలేజ్ కమిటీకి పంపించాల్సిందిగా స్పీకర్ తమ్మినేని సీతారాంను శ్రీకాంత్ రెడ్డి కోరారు. దీనికి స్పీకర్ స్పందిస్తూ ప్రివిలేజ్ కమిటీకి పంపుతామని బదులిచ్చారు.
దీంతో పాటు రెండు రోజుల క్రితం అసెంబ్లీ బయట టీడీపీ సభ్యులు, అసెంబ్లీ మార్షల్స్ మధ్య జరిగిన సంఘటనలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారన్నా శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నకు బదులిస్తూ, ఆ అంశాన్ని ఎథిక్స్ కమిటీకి పంపించామని స్పీకర్ తెలిపారు. ఈ రోజు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలపై చర్చ జరిగిన సందర్భంలో కూడా టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానమిస్తూ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్పందిస్తూ అచ్చెన్నాయుడు అవాస్తవాలు చెబుతున్నారని, ఈ విషయంపై సభాహక్కుల నోటీసు ఇస్తామని చెప్పారు. మరో వైపు ఈ రోజుతో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ముగియనున్నాయి.
[subscribe]