టీడీపీ సీనియర్ నాయకురాలు, చిత్తూరు మాజీ ఎమ్మెల్యే డీకే సత్యప్రభ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె బెంగళూరులోని వైదేహి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో గురువారం రాత్రి గుండెపోటుకు గురై ఆమె తుదిశ్వాస విడిచారు. అయితే కొన్ని రోజుల క్రితం ఆమె కరోనా బారినపడి కోలుకున్నారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త, టీటీడీ మాజీ చైర్మన్ ఆదికేశవులునాయుడు సతీమణి అయిన సత్యప్రభ, ఆయన మరణం అనంతరం రాజకీయాల్లోకి వచ్చారు. ఏపీలో 2014లో జరిగిన ఎన్నికల్లో చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతరం 2019 ఎన్నికల్లో రాజంపేట నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇటీవలే ఆమె టీడీపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా రెండోసారి కూడా ఎంపిక అయ్యారు.
టీడీపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే సత్యప్రభ హఠాన్మరణం దిగ్భ్రాంతిని కలిగించిందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. “చిత్తూరు శాసనసభ్యురాలిగా ఆమె తాగునీటి కొరత నివారణకు, చెరువుల అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. పారిశ్రామిక, విద్యాసంస్థల ద్వారా ఎందరికో ఉపాధి కల్పించారు. సత్యప్రభ గారి మృతి తెలుగుదేశం పార్టీకి మరియు చిత్తూరు జిల్లాకు తీరనిలోటు. ఆమె ఆత్మకు శాంతిచేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తూ, వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను” అని చంద్రబాబు పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ