మూడున్నరేళ్లుగా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ జవసత్వాలు కోల్పోయింది. ఎన్నిక ఏదైనా ఓటమి తప్పా.. గెలుపు రుచి చూడలేదు. దీంతో పార్టీ కేడర్ కూడా నిస్తేజంలో ఉండిపోయింది. అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వం నగదు బదిలీ, వలంటీర్ వ్యవస్థ వంటి సరికొత్త నిర్ణయాలతో ప్రజల్లో ఆశలు రేపింది. వైసీపీకి ప్రజల్లో పట్టు పెరిగింది. టీడీపీ అధినేత చంద్రబాబు నియోజకవర్గంలో కూడా స్థానిక ఎన్నికల్లో వైసీపీ జెండానే ఎగిరింది. దీంతో పసుపు పార్టీ పని అయిపోయిందనే ప్రచారమూ జరిగింది. ఏడాది కాలంగా పుంజుకుంటూ వచ్చింది. లోకేశ్ పాదయాత్రతో కేడర్ లో కాస్త ఉత్సాహం పెరిగింది. తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు జైలుకు వెళ్లాక చేపట్టిన కార్యక్రమాల ద్వారా పార్టీలో మళ్లీ ఊపు వచ్చింది. పూర్వ వైభవం దిశగా ముందుకు సాగుతోంది.
చంద్రబాబు బెయిలుపై బయటకు వచ్చాక.. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ పార్టీని మళ్లీ పైకి లేపారు. బాబు జైలులో ఉండగానే.. కలిసి పోటీ చేస్తామంటూ.. జనసేనానితో చెప్పించి రాజకీయాల్లో కీలకమలుపునకు శ్రీకారం చుట్టారు. ఇప్పుడు టీడీపీ – జనసేన కలిసి జగన్ ను ఎదుర్కొందుకు సిద్దమయ్యాయి. బీజేపీని కూడా కలుపుకునే పనిలో ఉన్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి. ఇంతలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొన్ని నియోజకవర్గాల్లో ఇన్ చార్జిలు మారుస్తుండడం టీడీపీకి కలిసి వచ్చింది. అసంతృప్త నాయకులు టీడీపీకి లైను కడుతుండడంతో పార్టీలో జోష్ పెరిగింది. రా.. కదిలిరా.. అంటూ కృష్ణా జిల్లాలో బాబు ఇప్పటికే ఎన్నికల శంఖారావం పూరించారు. తెలుగుదేశం మళ్లీ పుంజుకోవడంతో కీలక నేతలు సైతం అటువైపు చూస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆశావహుల తాకిడి పెరిగింది.
చంద్రబాబు సైతం అభ్యర్థుల ఎంపికకు కసరత్తు మొదలుపెట్టడంతో టీడీపీ కేంద్ర కార్యాలయంలో నేతల సందడి పెరిగింది. ఆశావహులు, వారి అనుచరులు పెద్దసంఖ్యలో తరలివచ్చి చంద్రబాబు దృష్టిలో పడే ప్రయత్నం చేస్తున్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ద్వారకానాథరెడ్డి ఇటీవల టీడీపీలో చేరారు. ఆయనతోపాటు టికెట్ ఆశిస్తున్న రాంప్రసాద్ రెడ్డి అనే నేత తన సహచరులతో చంద్రబాబును కలిశారు. అదే నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే రమేశ్కుమార్రెడ్డి కూడా తన సహచరులతో తరలివచ్చారు. వారంతా చంద్రబాబును కలిసే ప్రయత్నంలో ఉన్నారు. రమేశ్రెడ్డి ఆ సీటుకు బలమైన పోటీదారుగా ఉన్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గానికి చెందిన పార్టీ నేత నల్లపాటి రాము అనుచర వర్గం కూడా కార్యాలయానికి వచ్చింది.
దివంగత టీడీపీ నేత కోడెల శివప్రసాదరావు తనయుడు శివరాం వర్గీయులు నరసరావుపేటలో టపాసులు కాల్చడం ఆసక్తిగా మారింది. శివరాంకు ఆ టికెట్ ఖరారైనట్లుగా ఆయన అనుచరులు హడావుడి చేశారు. దీంతో అప్రమత్తమైన రాము వర్గీయులు.. అధినేతను కలుసుకునేందుకు వచ్చారు. ఇంకొందరు నేతలు జయహో బీసీ సదస్సుకు హాజరైన చంద్రబాబుకు తమ వినతులు విన్నవించారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ తనకు మరోసారి అవకాశం ఇవ్వాలని సదస్సు వేదికపైనే చంద్రబాబును అభ్యర్థించారు. వెళ్లి పనిచేసుకోవాలని ఆయన సానుకూలంగా చెప్పారంటూ ఆ తర్వాత తన అనుచరులకు చెప్పి కాస్త హడావుడి చేశారు. అనంతపురం జిల్లా పెనుకొండ టికెట్ ఆశిస్తున్న మహిళా నేత సబిత, చిత్తూరు ఆశిస్తున్న నాజర్, గుంతకల్ రేసులో ఉన్న మాజీ ఎమ్మెల్యే జితేందర్ గౌడ్ తదితరులు కూడా వచ్చి నేతలను కలిశారు. వచ్చినవారిలో అనంతపురం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి,. కడప జిల్లా ప్రొద్దుటూరు టికెట్ ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి కూడా ఉన్నారు.
వీరే కాకుండా.. వైసీపీ నుంచి మరికొందరు ఎమ్మెల్యేలు టీడీపీ టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు నుంచి తగిన హామీ వచ్చిన వెంటనే తెలుగుదేశంలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా చూస్తే ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశానికి అసెంబ్లీ సీటు కోసం ఆశావహులు తాకిడి బాగానే ఉంది. మరోవైపు జనసేన.. పొత్తు కుదిరితో బీజేపీకి కూడా కొన్ని సీట్లు కేటాయించాల్సి ఉంటుంది. పార్టీలోనే ఆశావహుల తాకిడి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో చంద్రబాబు ఎలా బ్యాలెన్స్ చేస్తారనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE