ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024లో జరుగబోయే ఎన్నికలలో 170 సీట్లకు పైగా సాధించటమే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జిల్లాల ఇన్ఛార్జి మంత్రులు, ప్రాంతీయ సమన్వయ కర్తలు, జిల్లా అధ్యక్షులతో సమావేశమైన ఆయన వచ్చే ఎన్నికలే లక్ష్యంగా పలు సూచనలిచ్చారు. జూలై 8న పార్టీ ప్లీనరీ నిర్వహించడానికి నిర్ణయించినట్లు తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నెల రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు, మే 10 నుంచి “గడప గడపకూ వైఎస్ఆర్సీపీ” అనే కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. జిల్లా వైఎస్ఆర్సీ అధ్యక్షులకు జిల్లా అభివృద్ధి మండలిగా కేబినెట్ హోదా కల్పిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేస్తామని, పార్టీ ప్లీనరీ జరిగే జూలై 8లోపు జిల్లా స్థాయిలో పార్టీ కమిటీలను ఏర్పాటు చేస్తామని సీఎం జగన్ చెప్పారు.
మేనిఫెస్టోలో చెప్పిన ప్రతిపథకం అమలు చేశామని, అందులోని హామీలలో 95 శాతం హామీలను మనం ఇప్పటికే నెరవేర్చామని పేర్కొన్నారు. మంత్రి పదవుల్లో ఉన్నవారు కూడా మిగిలిన నాయకుల వలెనే గడపగడపకూ వెళ్లి ప్రజలను కలవాలని సూచించారు. అలాగే ప్రతి ఎమ్మెల్యే నెలకు 10 సచివాలయాలు సందర్శించాలని, ఈ క్రమంలో ఒక్కో సచివాలయం పరిధిలో 2 రోజులు సమయం కేటాయించాలని ఆదేశించారు. ఈ 2 రోజుల పర్యటన తర్వాత వెంటనే బూత్ కమిటీలు ఏర్పాటు చేయాలని, ఈ కమిటీల్లో 50 శాతం మహిళలు ఉండేలా చూసుకోవాలి, ఇంకా కనీసం 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఉండేలా చూసుకోవాలని తెలిపారు. గత ఎన్నికల్లో 151 సీట్లు సాధించాం, ఈసారి 170 సీట్లకి తగ్గకుండా మనం గెలవాలి అని పేర్కొన్నారు. ఎమ్మెల్యేల పనితీరును ఎప్పటికప్పుడు అంచనా వేసేందుకు ఎప్పటికప్పుడు సర్వేలు చేయించుకుంటానని సీఎం జగన్ స్పష్టం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ