ఆంధ్రప్రదేశ్ లో త్వరితగతిన టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తిచేయాలని, మౌలిక సదుపాయాల కల్పన పనులను ప్రాధాన్యతా ప్రాతిపదికన చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆయన సోమవారం తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో పట్టణాభివృద్ధి శాఖ మరియు జగనన్న హరిత నగరాల కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ అధికారులతో మాట్లాడుతూ.. వర్షాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోని రోడ్ల మరమ్మతు పనులను వీలైనంత త్వరగా చేపట్టాలని సూచించారు.
నాడు-నేడు పథకం కింద చేపట్టిన పనులకు సంబంధించి మరమ్మతు పనులకు ముందు మరియు తర్వాత సంబంధిత అధికారులు తప్పనిసరిగా చిత్రాలను తీయాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా పట్టణాలు, నగరాలలో నిర్మాణాల్లో ఉన్న ఫ్లై ఓవర్లను, ఆర్వోబీలను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని, అలాగే నిర్మాణపరంగా అత్యుత్తమంగా ఉండాలని, నాణ్యతలో రాజీపడొద్దని అధికారులకు చెప్పారు. ఏపీలోని ఎయిర్ పోర్టుల నుంచి నగరాలకు వెళ్లే రోడ్లను అందంగా తీర్చిదిద్దాలని ఆదేశిస్తూ గన్నవరం నుంచి విజయవాడ, భోగాపురం నుంచి విశాఖపట్నంకు వెళ్లే రహదారులను ఉదహరించారు. అలాగే కృష్ణా గోదావరి నదులు మురుగునీటి వల్ల కలుషితం అవుతున్నాయని, శుద్ధిచేసిన తర్వాతనే అవి కాల్వల్లోకి, నదుల్లోకి చేరేలా మురుగునీటి జలాల శుద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం సూచించారు.
సీఎం జగన్ సూచనలపై అధికారులు స్పందిస్తూ.. తాము చేపడుతున్న ప్రాజెక్టులకు సంబంధించి పూర్తి వివరాలను సమర్పించారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన ఈ మూడేళ్లలో రూ. 4,500 కోట్లు ఖర్చుచేశామని, అలాగే మరో రూ. 6 వేల కోట్లు ఖర్చు చేయనున్నామని వివరించారు. నగరపాలక సంస్థలు, పురపాలక సంస్థల్లో రోడ్ల అభివృద్ధికి 16762 రోడ్లకు సంబంధించి 4396,65 కి.మీ మేర రోడ్ల కోసం రూ.1826.22 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. ఈ పాటికే 51.92 శాతం పనులు పూర్తి చేశామని, జులై 15 కల్లా రోడ్లపై గుంతలు లేకుండా చర్యలు చేపడుతున్నామని సీఎం జగన్ కు చెప్పారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY