దేశవ్యాప్తంగా లోన్ యాప్ నిర్వాహకుల ఆగడాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. వారి వేధింపులు తాళలేక ప్రతి రోజూ ఎక్కడో ఒక చోట ఆత్మహత్యలు జరుగుతూనే ఉన్నాయి. ఇదే క్రమంలో తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా, రాజమహేంద్రవరంలో రుణ యాప్లు వేధింపుల భరించలేక భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో వారి ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. ఇక ఈ ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. తల్లిదండ్రుల మృతితో అనాథలైన ఇద్దరు చిన్నపిల్లలకు ప్రభుత్వం నుంచి ఆర్ధిక సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ఒక్కొక్కరికి రూ. 5 లక్షల చొప్పున అందించాలని, అలాగే ఆ పిల్లల సంరక్షణకు ఏర్పాట్లు చేయాలని కూడా సీఎం జగన్ జిల్లా కలెక్టర్ కె. మాధవీలతకు సూచించారు.
వివరాల్లోకి వెళ్తే.. అల్లూరి సీతారామరాజు జిల్లా, రాజవొమ్మంగి మండలం లబ్బర్తి గ్రామానికి చెందిన దుర్గారావు, రామలక్ష్మి దంపతులు జీవనోపాధికోసం పదేళ్ల క్రితం రాజమండ్రికి వలస వచ్చారు. కాగా వారికి ఇద్దరు పిల్లలు తేజస్వి నాగసాయి (4), లిఖిత శ్రీ (2). అయితే ఆర్థిక ఇబ్బందులతో ఇటీవల వీరు ఒక ఆన్లైన్ లోన్ యాప్లో అప్పు తీసుకున్నారు. సమయానికి చెల్లించలేకపోవడంతో యాప్ల నిర్వాహకుల నుంచి వేధింపులు ఎదురయ్యాయి. మార్పింగ్ చేసిన అసభ్య వీడియోలతో వారిని వేధించగా, మనస్తాపం చెందిన దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో వారి చిన్నారులు అనాథలయ్యారు. ఇక ఈ ఘటనపై వార్తలు రాగా, స్పందించిన సీఎం జగన్ ఆ పిల్లల సంరక్షణ మరియు ఆర్ధిక సాయానికి అధికారులకు ఆదేశాలిచ్చారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ