ఆంధ్రప్రదేశ్లోని పొదుపు సంఘాల (డ్వాక్రా) మహిళలకు వైఎస్ఆర్ ఆసరా పథకం కింద మూడో విడత నిధులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అందజేశారు. ఈ మేరకు శనివారం ఏలూరు జిల్లా దెందులూరులో పర్యటించిన ఆయన బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో నగదును జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ఇప్పటివరకు 2 విడతలుగా రూ.12,758 కోట్లు పొదుపు సంఘాల మహిళల ఖాతాల్లో జమ చేశామని, నేడు మూడో విడత కింద 78.94 లక్షల మంది డ్వాక్రా మహిళల ఖాతాల్లో మరో రూ.6,149 కోట్లు పంపిణీ చేశామని తెలిపారు. నేటి నుంచి ఏప్రిల్ 5 వరకు దాదాపు 10 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేల నేతృత్వంలో నగదు పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నామని వెల్లడించిన ఆయన, ఈ సందర్భంగా లబ్ధిదారులతో ప్రజాప్రతినిధులు ముఖాముఖీ మాట్లాడతారని చెప్పారు.
ఇక పాదయాత్రలో తాను డ్వాక్రా మహిళల బాధలు స్వయంగా చూశానని, అప్పుడే వారికి అండగా ఉంటానని మాటిచ్చానని సీఎం జగన్ గుర్తు చేశారు. అప్పుడు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నానని, మహిళా సాధికారతే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన స్పష్టం చేశారు. దీనిలో భాగంగానే అధికారం చేపట్టాక ఏప్రిల్ 11, 2019 న, మొత్తం 4 విడతలుగా గ్రామీణ మరియు పట్టణ పేద మహిళా స్వయం సహాయక బృందాల బకాయి బ్యాంకు రుణాలను మాఫీ చేసేందుకు వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని ప్రకటించామని సీఎం జగన్ తెలియజేశారు. ఆసరా కింద అందిస్తున్న ఈ నగదును ఎలా వినియోగించుకుంటారో లబ్ధిదారుల ఇష్టమని, అయితే వారు ఈ మొత్తాన్ని స్వయం ఉపాధికోసమే వాడతారని భావిస్తున్నానని చెప్పారు. ఇక రాష్ట్రంలో డీబీటీ ద్వారా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని, వీటిలో ఎక్కడా ఎలాంటి అవినీతికి చోటులేదని, వివక్ష లేదని, నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకే నగదును జమ చేస్తున్నామని సీఎం జగన్ వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE