ఊహించినట్లుగానే తెలుగుదేశం పార్టీతో భారతీయ జనతా పార్టీ పొత్తు ఖరారైంది. ఇప్పుడు కూటమి అంటే రెండు కాదు.. మూడు పార్టీలుగా అధికారికంగా తెరపైకి వస్తున్నాయి. ఇంకా సీట్ల అంశం కొలిక్కి రాకపోయినా, పొత్తు పక్కా అనేది స్పష్టమైంది. ఇప్పటికే జోరు మీదున్న టీడీపీ-జనసేన పార్టీలు తాజాగా బీజేపీ జతకలవడంతో మరింత దూకుడుగా ప్రచారం చేసేందుకు సిద్ధం అవుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లక్ష్యంగా టీడీపీ-జనసేనకు తోడు బీజేపీ కారాలు, మిరియాలు నూరేందుకు సిద్ధం అవుతోంది. బీజేపీ ఏపీ అధ్యక్షురాలు అడపాదడపా జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో మరిన్ని ప్రశ్నలు సంధించేందుకు సిద్ధం అవుతున్నారు.
అయితే.. మూడు పార్టీల అధినేతలు జట్టుకట్టినా, క్షేత్రస్థాయిలో కార్యకర్తలు ఎలా ముందుకు వెళ్తారు అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. టీడీపీ-జనసేన కూటమి జాబితా అనంతరం కొన్నిచోట్ల ఆందోళనలు కొనసాగాయి. ఫలితంగా పి.గన్నవరం నియోజకవర్గం చోట్ల అభ్యర్థిని మార్చాల్సి వస్తోంది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి కేటాయించే స్థానాల్లో ఏం జరగనుందనే దానిపై ఉత్కంఠ ఏర్పడింది. కేంద్రంలో బీజేపీ బలంగా ఉన్నందున 8 నుంచి 10 లోక్సభ స్థానాలు తమకు కేటాయించాలని బీజేపీ పెద్దలు కోరినప్పటికీ అందుకు చంద్రబాబునాయుడు సుముఖత వ్యక్తం చేయలేదని తెలిసింది. ఎన్డీఏతో భాగస్వామ్యం కోరుకుంటున్న నేపథ్యంలో సీట్ల సర్దుబాటుపై సున్నితంగా చర్చిస్తున్నారు. ‘‘అసెంబ్లీలో మీరు సాధ్యమైనన్ని సీట్లు గెలిచి అధికారంలోకి రావాలని మాకు తెలుసు. లోక్సభలో కనీసం 370 స్థానాలు నెగ్గాలని మేం లక్ష్యంగా పెట్టుకున్నాం. అందువల్ల ప్రతి మిత్రపక్షం నుంచి సాధ్యమైనన్ని ఎక్కువగా అడుగుతున్నాం’’ అని చంద్రబాబుతో బీజేపీ నేతలు చెప్పినట్లు తెలిసింది.
కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసేముందు పార్టీ నేతలు రామ్మోహన్ నాయుడు, కనకమేడల రవీంద్ర కుమార్, రఘురామకృష్ణం రాజు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, లావు కృష్ణదేవరాయలు తదితరులతో చంద్రబాబు చర్చలు జరిపారు. మరోవైపు బీజేపీ అగ్రనేతలు రాష్ట్ర బీజేపీ నేతలతో సమీక్ష జరిపారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్ని సీట్లకు పోటీ చేయాలన్న విషయంపై రాత్రి పొద్దుపోయేదాకా చర్చించారు. విజయావకాశాలు ఉన్న సీట్ల గురించి స్పష్టమైన అంచనాకు రావాలని ఆదేశించారు. దీంతో రాష్ట్ర బీజేపీ నేతలు గురువారం మరోమారు ఢిల్లీలో సమావేశమయ్యారు. పొత్తులో భాగంగా టీడీపీని పది లోక్సభ సీట్లు, 20 అసెంబ్లీ సీట్లు అడగాలని వారు అధిష్ఠానానికి ప్రతిపాదించినట్లు సమాచారం. అయితే… అసెంబ్లీ సీట్లపై తమకు పెద్దగా ఆసక్తిలేదని, లోక్సభ సీట్లే వీలైనన్ని ఎక్కువగా అడగాలని అధిష్ఠానం పెద్దలు రాష్ట్ర నేతలకు చెప్పినట్లు తెలిసింది.
సీట్ల లెక్క తేలి టీడీపీ-జనసేన-బీజేపీ ప్రచారంలో దిగితే ఏపీలో ఎన్నికల మూడు ఎలా మారుతుంది అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. టీడీపీతో జనసేన కలిశాక కాస్త పార్టీలో జోష్ పెరిగింది. ఇప్పుడు బీజేపీతో కలవడం ప్లస్సా, మైనస్సా అనేది చూడాలి. ఎందుకంటే.. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఇప్పటివరకూ బీజేపీ ప్రభుత్వం నాన్చుడు ధోరణితో వ్యవహరిస్తోంది. ఈక్రమంలో రాష్ట్రానికి హోదా ఇవ్వని పార్టీతో టీడీపీ-జనసేన కలవడం ఎంతవరకు కలిసి వస్తుందో, రాజకీయాలు ఎలా మారతాయే చూడాలి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ