ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం రాష్ట్రంలో రోడ్ల నిర్మాణం, జరుగుతున్న మరమ్మతు పనుల ప్రగతిపై తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. రహదారులు భవనాలు, పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ, నిడా, పురపాలక, పట్టణాభివృద్ధి, గిరిజన సంక్షేమశాఖల పరిధిలో నిర్వహిస్తున్న రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై సీఎం సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా రహదారుల మరమ్మత్తుల కార్యక్రమాలు చురుగ్గా సాగుతున్నాయని, నాడు–నేడు కింద చేపడుతున్న పనుల్లో మంచి పురోగతి కనిపిస్తోందన్నారు. పనులు ప్రారంభమై ఆసంపూర్తిగా ఉన్న రోడ్లు, బ్రిడ్జిలు, ఆర్వోబీలు, ఫ్లై ఓవర్లను పూర్తి చేసేలా తక్షణమే చర్యలు తీసుకోవాలని, వీటికి సంబంధించిన పనులు ఎక్కడా కూడా పెండింగ్లో ఉండకూడదన్నారు. వీటికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి, పనులను వేగవంతంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని, పనులు పూర్తైన వెంటనే త్వరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని సీఎం సూచించారు. అసంపూర్తిగా ఉన్న రోడ్లను పూర్తి చేయడమే కాకుండా, గుంతలు లేని రోడ్లను తీర్చిదిద్దాలన్నారు.
ఆర్ అండ్ బీ పరిధిలో మరమ్మతులు, స్పెషల్వర్క్స్ కింద 7804 కి.మీ మేర రూ.2205 కోట్లు ఖర్చుతో 1168 పనులు చేపట్టగా, ఇప్పటికే రూ.1369 కోట్ల విలువైన 675 పనులు పూర్తయ్యాయని, మరో 491 పనులు కొనసాగుతున్నాయని అధికారులు తెలుపగా, మిగిలిన పనులు వీలైనంత త్వరగా పూర్తిచేసేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు. నాబార్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అసిస్టెన్స్ (నిడా–1) కింద చేపట్టిన పనులు చురుగ్గా సాగుతున్నాయని అధికారులు తెలిపారు. 233 పనులకోసం రూ. 2479.61 కోట్ల పనుల్లో రూ.1321.08 కోట్లు ఖర్చుచేశామని తెలిపారు. ఇక పంచాతీరాజ్ రోడ్ల మరమ్మతులు, నిర్మాణంలో భాగంగా 1843 రోడ్లకు రూ.1072.92 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తుందని, 4635 కి.మీ మేర రోడ్లను బాగుచేస్తునట్టు తెలిపారు. పంచాయతీ రాజ్ రోడ్లకు సంబంధించి ఇప్పుడు చేపడుతున్న పనులే కాకుండా, క్రమం తప్పకుండా నిర్వహణ, మరమ్మతులపై కార్యాచరణ సిద్ధం చేయాలని సీఎం సూచించారు. గిరిజన సంక్షేమశాఖలో కూడా రోడ్ల నిర్మాణం, మరమ్మతులపై దృష్టిపెట్టాలని, ప్రాధాన్యతా క్రమంలో ఇక్కడ కూడా పనులు చేపట్టాలన్నారు. మరోవైపు కార్పొరేషన్లు, మున్పిపాలిటీలలో చురుగ్గా రహదారుల మరమ్మతులు చేపట్టాలని, జులై 15 కల్లా గుంతలు పూడ్చి, జులై 20న ఫొటో గ్యాలరీలు పెట్టాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు.
రాష్ట్రంలో అభివృద్ధి పనులు ముందుకు సాగనీయకుండా రకరకాల కుట్రలు పన్నుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి రుణాలు ఇవ్వకూడదని, కేంద్రం నుంచి డబ్బులు రాకూడదని, కేసుల ద్వారా అడ్డుకోవాలని, తద్వారా అభివృద్ధి పనులు ఆగిపోవాలని ప్రతిపక్షాలు ఒక అజెండాతో పనిచేస్తున్నాయి. అయినా సడలని సంకల్పంతో అడుగులు వేస్తూ ముందుకు సాగుతున్నామని సమీక్ష సందర్భంగా సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ఈ సమీక్షా సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి బూడి ముత్యాలనాయుడు, పురపాలక పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఆర్ అండ్ బి మంత్రి దాడిశెట్టి రాజా, సీఎస్ సమీర్ శర్మ, పురపాలక పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై.శ్రీలక్ష్మి, ఆర్ అండ్ బి ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY