ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం నాడు యాస్ తుఫాన్ పై సమీక్ష నిర్వహించారు. యాస్ తుఫాన్ రాష్ట్రంలో ప్రభావం చూపే అవకాశం ఉన్న నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో స్థానిక అధికారులను అప్రమత్తం చేసినట్టు సీఎంకు అధికారులు వివరించారు. ఈ తుఫాను కారణంగా కరోనా బాధితులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా చూడాలని సీఎం అధికారులను సూచించారు. అలాగే ఆక్సిజన్ ఉత్పత్తి చేసే ప్లాంట్లు, కరోనా బాధితులకు చికిత్స అందించే ఆసుపత్రుల్లో విద్యుత్ సరఫరాకు ఎలాంటి అంతరాయం లేకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. విద్యుత్ సరఫరా విషయంలో అవసరమైన సాంకేతిక సిబ్బందిని సిద్ధంగా ఉంచుకుని, సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు.
తుఫాను కారణంగా రాష్ట్రంలో ఆక్సిజన్ సరఫరాలో కూడా ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని చెప్పారు. యాస్ తుపాను ప్రభావితం చూపే జిల్లాల్లోని ఆసుపత్రుల్లో అవసరమైతే కరోనా బాధితుల తరలింపుపై తగిన చర్యలు చేపట్టాలని, ఇందుకోసం ముందుగానే ఎక్కడికి తరలించాలనే దానిపై నిర్ణయం తీసుకుని, తుపాను ప్రభావం ప్రారంభం కాకముందే తరలింపు చేపట్టాలని అధికారులకు సీఎం జగన్ స్పష్టం చేశారు. మరోవైపు రాబోయే 24 గంటల్లో యాస్ తుఫాను చాలా తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ